“తెలుగుదేశం పార్టీ మరో చౌకబారు ఎత్తుగడకు సిద్ధమైందని, వందల వేల మందితో పోలవరం సందర్శించాలనుకోవడం ప్రజలను మభ్యపెటెందుకే ఈ సరికొత్త డ్రామా అని” రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. గురువారం నియోజకవర్గ కేంద్ర కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ పోలవరం దగ్గరలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభలో చంద్రబాబు ఈ మూడు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని ,సమాధానం ఇవ్వకుండా దాటవేసే ధోరణి అవలంబించకూడదన్నారు.
విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో కేంద్రమే నిర్మించాలని ఉన్నా, “కేంద్రప్రభుత్వ నిధుల”తో రాష్ట్ర ప్రభుత్వమే ఆలస్యం కాకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తామని ప్రకటించిన మాట నిజమా కాదా.? అని ప్రశ్నించారు. 2018 లోగా కుడి, ఎడమల కాలువలకు పోలవరం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేస్తామని అసెంబ్లీలో బల్లలు చరిసి సవాలు చేసిన మాట నిజం కాదా ప్రశ్నించారు? ఎందుకు సకాలంలో పూర్తి చేయలేకపోయారని దుయ్యబట్టారు.
కాపర్ డ్యామ్ నిర్మించకుండా, అసంపూర్తిగా వదిలేసి డయాఫ్రమ్ వాల్ ఎలా నిర్మించారని..? ఇది చారిత్రక తప్పిదమన్నారు. దీనికి సమాధానం చెప్పాలన్నారు. పోలవరం ప్రాజెక్టు వద్ద బహిరంగ సభకు అనుమతి లేదని, ఆ పార్టీ నాయకులు సందర్శించాలనుకుంటే అనుమతి తీసుకొని సందర్శించవచ్చని అయితే వందల వేల మందితో వెళ్లి ఘర్షణ వాతావరణాన్ని సృష్టించాలనుకుంటున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో మునిసిపల్ నాయకులు చల్లచర్ల సాంబశివరావు, వైస్ చైర్మన్ షేక్ నాగూర్ మీరాన్, కౌన్సిలర్ అచ్యుత శివప్రసాద్, కోడిరెక్క దేవదాసు సహారా మౌలాలి స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు.