శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఈ నెల 24 వ తేదీ వరకు ఖమ్మం కమిషనరేట్ పరిధిలో 30 పోలీస్ యాక్ట్ యధావిధిగా అమలులో వుంటుందని పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆంక్షలు అమలుల్లో వున్నందున అనుమతి లేకుండా ఎలాంటి సభలు, ర్యాలీలకు, సమావేశాలు నిర్వహించరాదని సూచించారు.
గుంపులుగా తిరగటం నిషేధం వున్న నేపథ్యంలో వివిధ వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహకరించాలని కోరారు . ఖమ్మం పోలీస్ కమీషనరేట్ లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 30 పోలీసు యాక్ట్ అమలు చేస్తున్నట్లు పోలీస్ కమీషనర్ తెలిపారు.
ఈ నిబంధనల ప్రకారం స్ధానిక పోలీసుల అనుమతి లేకుండా ఎటువంటి ర్యాలీలు, ఊరేగింపులు, సభలు, సమావేశాలు నిర్వహించరాదు. మారణాయుధాలతో తిరగడాన్ని, ప్రమాదకర పనిముట్లను దురుద్దేశముతో వెంట ఉంచుకోవడాన్ని చట్టవిరుద్ధ చర్యలుగా పరిగణించబడుతుంది.
రోడ్లపై, కాలనీలు, ఇతర ప్రజా సంబంధ, బహిరంగ ప్రదేశాలలో గుంపులుగా గుమిగూడరాదు. సామాజిక మాధ్యమాలలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, శాంతిభద్రతలను భంగం కలిగించడం, ప్రజలను భయబ్రాంతులకు గురి చేసేలా వ్యవహరించే వ్యక్తులపై కేసులు నమోదు చేయడం జరుగుతుంది.