ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబి) స్టాఫ్ అంకిత్ శర్మ అత్యంత కిరాతకంగా హత్య చేసిన సంఘటనకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ ను పోలీసులు అరెస్టు చేశారు. గత వారం ఈశాన్య ఢిల్లీలో హింస చెలరేగిన సమయంలో అంకిత్ శర్మను అతి కిరాతకంగా చిత్రహింసలకు గురి చేసి హత్య చేసిన విషయం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది.
ఈ ఆరోపణలు రావడంతో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ ను సస్పెండ్ చేశారు. అనంతరం అతను పరారీలో ఉన్నాడు. శర్మ తండ్రి ఫిర్యాదు మేరకు హుస్సేన్ పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తాహిర్ హుస్సేన్ పై భారత శిక్షా స్మృతి (ఐపీసీ) 365 (అపహరణ, అపహరణకు గురికావడం), 302 (హత్య) సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. అతను యాంటిసిపేటరీ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా కోర్టు దానిని తిరస్కరించింది. అనంతరం ఆయన లొంగిపోతానని చెప్పినా కోర్టు అనుమతించలేదు.
దాంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. అతని లొంగుబాటు దరఖాస్తును కోర్టు తిరస్కరించిన అనంతరం గురువారం అరెస్టు చేశారు. ఫిబ్రవరి 24, 25 తేదీల్లో శర్మను అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ హత్య కేసు ఒక్కటే కాకుండా హుస్సేన్ తన పొరుగు ఇళ్ల పై పెట్రోలు బాంబులు, రాళ్లను కూడా వేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.పోలీసుల పరిశోధనలో హుస్సేన్ ఇంట్లో రాళ్లు, ఇటుకలు, పెట్రోలు బాంబులు లభించాయి. హత్యలో తన ప్రమేయం లేదని హుస్సేన్ అంటున్నాడు.