పోలీసులంటే కేవలం శాంతి భద్రతల పరిరక్షణే కాదు ప్రజల ప్రాణాలు కాపాడడంలోనూ నిరంతరం ముందుంటారని చెప్పడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఖాకీలు అంటే కర్కశత్వం కాదు మానవత్వంతో కూడిన బాధ్యత కలిగిన ఉద్యోగమని నిరూపించాడు ఈ సిఐ.
తన విధి నిర్వహణలో భాగంగా తాను పని చేస్తున్న డిండి సర్కిల్ నుండి జిల్లా కేంద్రమైన నల్లగొండకు వెళ్తున్న క్రమంలో కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకోబోతున్న వ్యక్తిని గుర్తించి వెంటనే వాహనం నిలిపి అతడిని పోలీస్ వాహనంలో నల్లగొండకు తీసుకువచ్చి దగ్గరుండి మరీ ఆసుపత్రిలో చేర్చి మానవత్వం చాటుకున్నాడా సిఐ.
వివరాల్లోకి వెళితే డిండి సిఐగా పని చేస్తున్న వెంకటేశ్వర్లు గురువారం రోజు తన విధి నిర్వహణలో భాగంగా డిండి నుండి జిల్లా పోలీసు కార్యాలయానికి వస్తుండగా గుర్రంపోడు శివారులో తానేపల్లి గ్రామానికి చెందిన ఓర్సు సుధాకర్ (29) కుటుంబ కలహాలతో విసుగు చెంది పురుగుల మందు సేవించడాన్ని గమనించిన ఆయాన వెంటనే తన వాహనాన్ని నిలిపి పురుగుల మందు సేవించిన సుధాకర్ ను పోలీస్ వాహనంలో నల్లగొండకు తీసుకువచ్చి స్థానిక సురక్ష ఆసుపత్రిలో చేర్పించారు.
అనంతరం వివరాలు తెలుసుకొని గుర్రంపోడు పోలీస్ స్టేషన్ ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడం ద్వారా ఆ వ్యక్తి ప్రాణాలు పోకుండా కాపాడి తన మానవత్వాన్ని చాటుకున్నారు సిఐ వెంకటేశ్వర్లు. ఆత్మహత్య చేసుకోబోయిన వ్యక్తిని గుర్తించి పోలీస్ వాహనంలో నల్లగొండకు తరలించి ప్రాణాలు కాపాడడంలో చొరవ చూపిన సిఐ వెంకటేశ్వర్లును ఎస్పీ రంగనాధ్, అదనపు ఎస్పీ నర్మద, డిటిసి అదనపు ఎస్పీ సతీష్ చోడగిరి, దేవరకొండ డిఎస్పీ ఆనంద్ రెడ్డిలు ప్రశంసించి అభినందనలు తెలిపారు.