అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా విజయనగరం జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో అక్టోబరు 21 నుండి 31 వరకు పలు కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక తెలిపారు. ఈ కార్యక్రమాల నిర్వహణలో భాగంగా అక్టోబరు 21న జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణంలో గల ‘స్మృతి వనం’లో విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన పోలీసు అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పించనున్నామన్నారు. పోలీసు అమర వీరుల త్యాగాలను స్మరిస్తూ స్మృతి పరేడ్ నిర్వహించి, ర్యాలీ చేపడతామన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధలు, జిల్లా అధికారులు, పోలీసు అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొంటారన్నారు. వారోత్సవాల్లో భాగంగా వివిధ పాఠశాలలు, కళాశాలల్లోను చదువుతున్న విద్యార్ధులకు “లైంగిక వేధింపుల నుండి మహిళలు మరియు పిల్లల రక్షణ – సామాజిక పాత్ర” అనే అంశంపైన, పోలీసు ఉద్యోగులకు “సోషల్ మీడియా దుర్వినియోగం మరియు సైబర్ మోసాల అరికట్టడంలో సాంకేతికత పాత్ర” అనే అంశం మీద వక్తృత్వ మరియు వ్యాస రచన పోటీలను నిర్వహిస్తామన్నారు. విజయనగరం సబ్ డివిజన్లో పరిధిలో “పోలీసుల త్యాగాలు” అనే అంశంపై సెమినార్ నిర్వహిస్తామన్నారు.
విజయనగరం పోలీసు పరేడ్ గ్రౌండు లోను, అదే విధంగా జిల్లా వ్యాప్తంగా విజయనగరం, బొబ్బిలి మరియు చీపురుపల్లి సబ్ డివిజన్లో అన్ని పోలీసు స్టేషన్ల పరిధిల్లో అక్టోబరు 26న “ఓపెన్ హౌస్” కార్యక్రమాలను చేపట్టి, పోలీసుల నిర్వహించే వివిధ విధులు, వినియోగించే వివిధ ఆయుధాలు, సాంకేతికత పట్ల విద్యార్థులకు అవగాహన కల్పిస్తామన్నారు. విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన పోలీసు అమరవీరుల స్వగ్రామాలను, వారి గృహాలను పోలీసు అధికారులు, మహిళా పోలీసులు సందర్శించి, వారి త్యాగాలను ప్రజలకు తెలియపర్చే విధంగా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు.
అదే విధంగా పోలీసు అమరవీరులు చదువుకున్న పాఠశాలలు/కళాశాలలను సందర్శించి వారి త్యాగాలను విద్యార్ధులకు తెలియపరుస్తామన్నారు. అక్టోబరు 27న “మెడికల్ క్యాంపు” & “బ్లడ్ క్యాంపు”ను పోలీసు కార్యాలయ ఆవరణలో నిర్వహిస్తామన్నారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ “క్యాండిల్ ర్యాలీ” ని నిర్వహిస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక తెలియజేశారు.