వరంగల్ జిల్లా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని మాల ల చైతన్య సమితి నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
గత నెల 31 వ తేదీన వరంగల్ హనుమకొండలో ఏర్పాటు చేసిన ఓసి కుల సంఘం మహాగర్జన సభలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ తక్కువ కులం వాళ్లకు తెలివి లేదు అక్షరం ముక్క రాదు అని వ్యాఖ్యానించడాన్ని మాలల చైతన్య సమితి ఖండించింది.
మాలల చైతన్య సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దెల రాందాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కేవలం అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ల వల్ల ఉద్యోగాలు వచ్చాయి తప్ప వాళ్లకు చదువు రాదు అంటూ చల్లా ధర్మారెడ్డి వ్యాఖ్యానించడం అగ్రకుల దురహంకారమేనని అన్నారు.
ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీల కులం వాళ్ళ వల్లనే రాష్ట్రం సర్వనాశనం అయ్యిందని ధర్మారెడ్డి అనడం దారుణమైన విషయమని ఆయన తెలిపారు.
బడుగు బలహీన వర్గాలపై అవమానకర వ్యాఖ్యలు చేసి ఆత్మగౌరవాన్ని దెబ్బతినే విధంగా అవమాన పరచి వాళ్ల రిజర్వేషన్లు తీసివేయాలని రాజ్యాంగాన్ని మార్చాలని ఆయన అనడం శోచనీయమని అన్నారు.
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ అవమానపరిచిన అగ్రకుల దురహంకారి పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.