నకిలీ పోలీస్ ప్రొఫైల్స్ కేసులో నిందితులను ఎనిమిది రోజుల కస్టడికి అప్పగించిన కోర్టు అనుమతి ఇచ్చినట్లు తెలిపిన నల్లగొండ టూ టౌన్ సిఐ ఎస్.ఎం. బాషా తెలిపారు. నకిలీ ఫేస్ బుక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసిన నిందితుల నుండి మరింత సమాచారం రాబట్టేందుకు కోర్టును అనుమతి కోరామని, సానుకూలంగా స్పందించిన జడ్జి ఈ రోజు నుండి ఎనిమిది రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతించారని తెలిపారు.
ఇప్పటికే ఈ కేసు విషయంలో నల్లగొండ పోలీసులను ఇతర రాష్ట్రాల పోలీసులు సంప్రదిస్తున్నారని చెప్పారు. దేశ వ్యాప్తంగా 350 కి పైగా పోలీస్ అధికారుల ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసిన భరత్ పూర్ యువకుల నుండి సమగ్ర సమాచారం రాబట్టాల్సి ఉన్నదన్నారు.
తాము ఎంతో శ్రమతో రాజస్థాన్ లోని భరత్ పూర్ వెళ్లి నేరస్తులను అదుపులోకి తీసుకున్నామని, దక్షిణాది రాష్ట్రాల పోలీస్ అధికారులతో పాటు ఉత్తర భారత దేశంలోనూ పలువురు పోలీస్ అధికారుల ప్రొఫైల్స్ నకిలివి తయారు చేసిన ఈ ముఠా చాలా మంది నుండి డబ్బులు తీసుకున్నట్లుగా తమకు సమాచారం ఉన్నదని తెలిపారు.
ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకు నకిలీ ఫేస్ బుక్ అకౌంట్ల విషయంలో భారీగా ఫిర్యాదులు వచ్చాయని, ఇతర రాష్ట్రాల పోలీసులతో పాటు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు సైతం పూర్తిగా సహకరించి తెలంగాణ పోలీసుల గౌరవం నిలిపే విధంగా విచారణ కొనసాగిస్తామని బాషా వివరించారు.