పోలీసులు, కొంత మంది అధికారుల సహకారంతో మునిసిపల్ ఎన్నికల్లో అధికార వైసీపీ దొంగ ఓట్లు వేసుకున్నదాని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్.శ్రీనివాస రెడ్డి అన్నారు. కడప జిల్లా రాయచోటి లో జరిగిన 3 వార్డుల ఎన్నికలో కొంత మంది పోలీసులు, అధికారులు అధికార పార్టీ తొత్తులుగా మారి దొంగ ఓట్ల సైక్లింగ్ కు సహకరించారని ఆయన ఆరోపించారు.
ఏకగ్రీవంగా ఎన్నికైన వైఎస్ఆర్సిపి కౌన్సిలర్లను జనరల్ ఏజెంట్లుగా నియమించి వారి ద్వారా 3 పోలింగ్ బూతుల నందు తెలుగుదేశం పార్టీ ఏజెంట్లను భయబ్రాంతులకు గురి చేసి ఎన్నికల అనంతరం వారి అంతు చూస్తామని బెదిరించారని ఆయన తెలిపారు.
వైసీపీ తరఫున జనరల్ ఏజెంట్లుగా ఉన్న వారి పైన క్రిమినల్ కేసులు ఉన్నా కూడా వారికి అనుమతి ఇచ్చి తెలుగుదేశం పార్టీ జనరల్ ఏజెంట్లను కేసులు ఉన్నాయని తిరస్కరించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అధికార పార్టీ ఏజెంట్లను మాత్రమే పోలింగ్ బూత్లోకి అనుమతిస్తూ.. ఇతర రాజకీయ పక్షాల ఏజెంట్లపై ఆంక్షలు పెట్టి ఇబ్బంది పెట్టారని అన్నారు.
జిల్లా కేంద్రమైన కడప లో కూడా వారి ఆగడాలకు అంతులేకుండా పోయిందని అన్నారు. ఉపముఖ్యమంత్రి అంజద్ బాష సొంత వార్డులోనే (29 డివిసిఒన్) టీడీపీ ఏజెంట్ లను భయబ్రాంతులకు గురి చేసి బయటకు పంపించడం చాలా దారుణం అన్నారు.