రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న క్రమంలో పోలీస్ సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉంటూ కోవిడ్ – 19 బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నల్లగొండ జిల్లా అదనపు ఎస్పీ నర్మద అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో రీడ్ స్వచ్చంద సంస్థ ప్రతినిధి డాక్టర్ అనూష ఆధ్వర్యంలో జిల్లాలోని పోలీస్ సిబ్బందికి హోమియో మందులను పంపిణీ చేయాలని కోరుతూ సుమారు 2000 మందికి సరిపడే మందులను అదనపు ఎస్పీకి అందచేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాపై ముందు వరుసలో ఉండి పోరాడుతున్న పోలీసులలో చాలా మందికి కరోనా వైరస్ సోకడం బాధాకరమన్నారు. కరోనా బారిన పడకుండా పోలీస్ సిబ్బంది మొత్తం రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడంతో పాటు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని, మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
స్వీయ నియంత్రణ ద్వారా మాత్రమే కరోనాను అధిగమించవచ్చని అందువల్ల ప్రతి ఒక్కరూ కరోనా పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు. పోలీస్ సిబ్బంది అందరూ వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన మార్గదర్శకాలను పాటిస్తూ కరోనా బారిన పడకుండా చూసుకోవాలని చెప్పారు.
జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ప్రతి నిత్యం సానిటైజ్ చేయడంతో పాటు భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రీడ్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది కోసం హోమియో మందులు ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయమని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో రీడ్ సంస్థ ప్రతినిధి డాక్టర్ అనూష, మిర్యాలగూడ సిఐ రమేష్ బాబు, సత్యం, డిపిఓ సూపరింటెండెంట్ దయాకర్, ఆర్.ఐ. నర్సింహా చారి, డిటిఆర్బీ సిఐ అంజయ్య, కార్తీక్, శంకర్, నవీన్, అజీజ్, గౌస్ తదితరులు పాల్గొన్నారు.