ఓవర్ యాక్షన్ చేసిన పోలీసులకు తగిన శాస్తి జరిగింది. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా మద్యం తాగిన యువకులు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనే కారణంగా మంగళవారం రాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వారిపై దాడి చేశారు.
ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. డిసెంబర్ 31 వేడుకల్లో భాగంగా సిరిసిల్ల పట్టణంలోని యువకులు అర్ధరాత్రి దాటిన తర్వాత రోడ్డుపై వెళ్తుండగా పోలీసులు పట్టుకెళ్లి ఇష్టమొచ్చినట్టు బాదారు. కడుపులో తన్నుతుండగా వీడియో తీసి పలువురు యువకులు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. ఈ విషయంపై సిరిసిల్ల పట్టణ సీఐ వెంకటనర్సయ్యను వివరణ కోరగా పట్టణంలోని పలువురు యువకులు గొడవ పడుతూ ఇనుప రాడ్లతో పరస్పరం దాడి చేసుకున్నారన్న సమాచారం మేరకు ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించామన్నారు.
అక్కడ యువకులు బీరు సీసాలు పగులగొట్టి, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తుండగా వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశామే తప్ప ఎవరినీ కొట్టలేదని చెప్పారు. అయితే పోలీసుల జులుంపై ఐజీ నాగిరెడ్డి సీరియస్ అయ్యారు. దాంతో ఇద్దరు ఎస్సైలు, కానిస్టేబుల్, హోంగార్డు ను అటాచ్ చేయాలని ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. దాంతో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే నలుగురిని అటాచ్ చేశారు.