ఆర్ధిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకలో ఇప్పుడు రాజకీయ సంక్షోభం కూడా తలెత్తింది. 41 మంది ఎంపీలు మంగళవారం పాలక సంకీర్ణానికి రాజీనామా చేశారు. దీంతో రాజపక్సా ప్రభుత్వం మైనారిటీలో పడింది. వీరిలో సొంత పార్టీకి చెందిన 12 మందితో పాటు శ్రీలంక ఫ్రీడమ్ పార్టీకి చెందిన 14 మంది, ఇతర మిత్ర పక్షాలకు చెందిన సభ్యులు ఉన్నారు.
రాజపక్స మినహా మంత్రులంతా ఆదివారం తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆర్థిక మంత్రి అలీ సబ్రీని నియమించిన 24 గంటల్లోనే రాజీనామా చేయడంతో పాలక పక్షానికి మరో ఎదురు దెబ్బ తగిలింది. రుణ ప్యాకేజీ కోసం అంతర్జాతీయ ద్రవ్య నిధితో కీలకమైన చర్చలు జరగాల్సి వున్న నేపథ్యంలో మంత్రి రాజీనామాతో సందిగ్ధ పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో తాను ఆర్థిక మంత్రిగా కొనసాగలేనని, ఆ స్థానంలో మరో ప్రత్యామ్నాయ వ్యక్తిని నియమించాలని ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. శ్రీలంకలో ఆందోళనలు మిన్నంటడంతో ఆస్ట్రేలియా, నార్వే, ఇరాక్ దేశాలు తమ రాయబార కార్యాలయాలను తాత్కాలికంగా మాసివేశాయి.
మరోవంక, నార్వే రాజధాని ఓస్లో, ఇరాక్ రాజధాని బాగ్దాద్ లోని రాయబార కార్యాలయాలతో పాటు సిడ్నీ లోని వాణిజ్య రాయబార కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు శ్రీలంక విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. శ్రీలంకలో ఆర్థిక పరిస్థితి దిగజారడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు నిండుకోవడంతో శ్రీలంక దారుణమైన ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోంది.