తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ మధ్య గతకొంత కాలంగా రాజకీయం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా సాగుతోంది. గులాబీ బాస్, సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించాలనే ప్రయత్నాల నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య పొలిటికల్ వార్ హీటెక్కుతోంది. ఈ క్రమంలో ఈ రెండు పార్టీలు ఏ కార్యక్రమం చేసినా పోటాపోటీగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 8వ తేదీన ప్రధాని హైదరాబాద్ పర్యటన రోజే బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంతో పాటు పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభకు హాజరయ్యేందుకు ప్రధాని మోడీ ఎల్లుండి హైదరాబాద్కు రాబోతున్నారు. తెలంగాణలో పాగా వేయడమే లక్ష్యంగా ఆయన హైదరాబాద్ పర్యటన ఉండబోతోందని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో నెలకొన్న లిక్కర్ స్కామ్, పేపర్ లీకేజీ, బండి సంజయ్ వంటి తాజా రాజకీయ పరిణామాలపై మోడీ స్పీచ్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే, సరిగ్గా మోడీ హైదరాబాద్ పర్యటన రోజే బీఆర్ఎస్ సైతం రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది.
సిగరేణిని ప్రైవేటీకరించబోమని రామగుండంలో ప్రధాని మాట ఇచ్చి తప్పారని తాజాగా మంత్రి కేటీఆర్ తాజాగా మండిపడ్డారు. సింగరేణి ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గకుంటే జంగ్ సైరన్ మోగిస్తామని హెచ్చరించారు. వేలం లేకుండానే సింగరేణికి బొగ్గు గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంచిర్యాల, భూపాలపల్లి, కొత్తగూడెం, రామగుండం కేంద్రాల్లో ఎల్లుండి మహా ధర్నాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇన్నాళ్లు సైలెంట్గా ఉన్న బీఆర్ఎస్ సడన్గా ప్రధాని పర్యటన రోజే ఆందోళనకు పిలుపునివ్వడం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. గతంలోనూ బీఆర్ఎస్ ఇలానే వ్యవహరిచిందని, గతేడాది బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్లో నిర్వహించిన సందర్భంలో బీజేపీ, బీఆర్ఎస్లు పోటాపోటీ సభలు నిర్వహించాయని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. ఆ సమయంలో ప్రధాని మోడీ మీటింగ్ కంటే ముందే యూపీఏ భాగస్వామపక్షాల రాష్ట్రపతి ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా రాష్ట్రానికి ఆహ్వనించడం, ఆయన్ను స్వయంగా సీఎం కేసీఆర్ విమానాశ్రయానికి వెళ్లి ఆహ్వానించడం హాట్ టాపిక్ అయింది. తాజాగా ఈసారి కూడా ఇదే వ్యూహాన్ని బీఆర్ఎస్ అమలు చేస్తోందనే చర్చ జరుగుతోంది. పోటాపోటీ కార్యక్రమాల ద్వారా బీజేపీ పట్ల ప్రజలకు ఉన్న మూడ్ ను డైవర్ట్ చేసేందుకు అధికార పార్టీ వ్యూహం పన్నిందనే చర్చ జరుగుతోంది.