8 ఏండ్ల లో తెలంగాణ ను అప్పుల ఊబిలో కూర్చిన ఘనుడు సీఎం కేసీఆర్.
తెలుగు ప్రజలకు భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి విశ్వమంగళ దినమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. దురదృష్టకరమేమిటంటే ప్రత్యేక రాష్ట్రం వచ్చి 8 ఏళ్లయినా ధనిక రాష్ట్రం అప్పుల తెలంగాణగా మారినా ప్రజల జీవితాల్లో మార్పు రాలేదని అన్నారు. దేశానికి అన్నం పెడుతున్న తెలంగాణ రైతులు నిండా కష్టాల్లో, నష్టాల్లో కూరుకుపోయారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ 4వ స్థానంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ తన విద్యుక్త ధర్మాన్ని వీడకుండా నీళ్లున్నా లేకున్నా, కరెంట్ వచ్చినా రాకున్నా, పంటకు ధర వచ్చినా రాకున్నా ఆరుగాలం కష్టపడి కలో,గంజో తాగి పంట పండించి దేశానికి అన్నం పెడుతున్న రైతన్నకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని సంజయ్ అన్నారు.
వచ్చే ఏడాది తప్పకుండా తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందని, రాష్ట్రానికి పట్టిన చీడ, పీడలు విరగడై సరికొత్త కాంతులతో రైతన్నలు సుఖసంతోషాల మధ్య సంక్రాంతి జరుపుకుంటారని ఆశిస్తున్నానని కరీంనగర్ ఎంపీ అన్నారు. అప్పుల తిప్పలు లేని, ఆత్మహత్యల్లేని, కల్లాల దగ్గర కన్నీళ్లులేని సుభిక్ష పాలన రావాలని కోరుకుంటున్నా. అప్పటిదాకా కష్టనష్టాలను ఎదుర్కొనే మనోధైర్యం ప్రజలకు ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు.పండుగ రోజు సైతం అబద్దాలు చెప్పకుండా ప్రజలకు వాస్తవాలు చెప్పేలా బుద్ధిని రాష్ట్ర పాలకులకు ప్రసాదించాలని భగవంతుడిని కోరుకుంటున్నానని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ,కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు.