లాక్ డౌన్ వల్ల పేద ప్రజలు ఎవరూ కూడా ఆకలితో అలమటించ కూడదన్న ఉద్దేశంతో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ సూచన మేరకు అంబర్ పేట లోని పోచమ్మ బస్తీ; అంజయ్య బస్తీలలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ ఆధ్వర్యంలో నేడు అన్నదానం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు సంతోష్ గొప్ప మనస్సుతో పేద ప్రజల ఆకలి తీర్చాలని ఉద్దేశంతో ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేయడం మంచి పరిణామమని అన్నారు.
దీనిని ఆదర్శంగా తీసుకొని ఇంకా కొంతమంది ముందుకు వచ్చి ఎవరికి తోచిన సహాయం వారు చేయాలని పిలుపునిచ్చారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం కోసం పచ్చదనాన్ని పెంపొందించడం కోసం మొక్కలు నాటడమే కాకుండా కూడా ఎవరు ఆపదలో ఉన్న కూడా మా శక్తి మేరకు సహాయం చేయడానికి ఎప్పుడూ ముందు ఉంటుందని దీన్ని ముందుండి నడిపిస్తున్న సంతోష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి కిషోర్ గౌడ్, దూసరి శ్రీనివాస్ గౌడ్ నల్లకుంట డివిజన్ టి.అర్. యస్ పార్టీ సీనియర్ నాయకుడు, బస్తీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.