‘ఒంటరి మహిళ’ ‘వితంతు పింఛన్’ పేరు మార్చాలని ఒక స్వచ్ఛంద సంస్థ పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టింది.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో జరిగిన ఈ కార్యక్రమంలో చీకూరి లీలావతి మాట్లాడుతూ సమాజంలో ఒంటరి, వితంతు పింఛన్ల పేర్లతో పింఛన్లు తీసుకోవడం వల్ల వారిపై చులకన భావం చూపిస్తున్నారని అన్నారు.
వారి పట్ల హేళనాభావం కనిపిస్తుందని అందువల్ల ఆ పేరును తొలగించి ధైర్యాన్ని నింపే విధంగా పేరు మార్చాలని కోరారు. ‘విన్నపము ఒక పోరాటం’ 50 పైసల కార్డుపై రాసి పోస్ట్ చేస్తున్నామని అన్నారు.
తెలంగాణ శాసన సభ్యులు అందరూ ఈ సున్నితమైన విషయాన్ని శాసనసభలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ప్రజాసభ సాక్షిగా సమాజంలో వారి మనోభావాలు కాపాడే విధంగా పేరు మార్పు చేయాలని, వారిలో ఆత్మ స్థైర్యం నింపాలని కోరారు.