వైకుంఠ ఏకాదశి వేడుకలకు తిరుమల తిరుమతి ముస్తాబైంది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన స్వామివారి దర్శనం కోసం భక్తులకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో జవహర్ రెడ్డి తెలిపారు.
ఈ నెల 25, 26 తేదీల్లో పరిమిత సంఖ్యలో భక్తులను దర్శనానికి అనుమతించనున్నట్లు ఆయన వెల్లడించారు. తిరుపతిలోని ఐదు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 50 కేంద్రాల్లో సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్లు ఈవో చెప్పారు.
వైకుంఠ ఏకాదశి నుంచి పది రోజుల పాటు రోజుకు 20 వేల టోకెన్లు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా వారికి తిరుపతిలో ఐదు చోట్ల రోజుకు 8 వేల మంది స్థానికులకు దర్శనం టోకెన్లు ఇస్తామని చెప్పారు.
డిసెంబరు 25, 26, జనవరి1 తేదీలో వీఐపీ సిఫార్సు లేఖలను అనుమతించబోమని టీటీడీ అదనపు ఈఓ ధర్మారెడ్డి స్పష్టం చేశారు.
తిరుపతి వాసులకు ఆధార్ ఉంటేనే టోకెన్లు ఇస్తామని.. ఇతరులకు తిరుపతి కేంద్రాల్లో 25 నుంచి జనవరి 3 వరకు టోకెన్లు ఇవ్వబోమని సూచించారు.
వర్చువల్ కల్యాణం తీసుకున్న వారికి డిసెంబరు 25, 26వ తేదీల్లో, జనవరి 1వ తేదీన దర్శనానికి అనుమతి ఉండదని తెలిపారు. తిరుమలకు స్వయంగా వచ్చే ప్రముఖులకు మాత్రమే దర్శన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.