అన్ని మండలాల్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణికి జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అదనపు కలెక్టర్ మను చౌదరి తో కలిసి కలెక్టర్ ఉదయ్ కుమార్ ప్రజల నుంచి పలు వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు.
మొత్తం 28 ఫిర్యాదులు, భూ సంబంధిత సమస్యలు, మున్సిపల్, వైద్యఆరోగ్య, సాంఘిక సంక్షేమ,తదితర ఇతర సమస్యల పరిష్కారానికి వినతిపత్రాలు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరై ఫిర్యాదులను పరిష్కరించడంలో చొరవ చూపాలన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.