కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో ప్రియాంకా గాంధీ వాద్రాకు చోటు కల్పించడంపై పార్టీ శ్రేణులలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే గాంధీ-నెహ్రూ కుటుంబానికి చెందిన సోనియాగాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా, రాహుల్ గాంధీ ముఖ్య నాయకుడుగా ఏఐసీసీలో వ్యవహరిస్తుండగా ప్రియాంక వాద్రాకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో స్థానం కల్పించడంలో ఔచిత్యాన్ని ప్రశ్నిస్తున్నారు.
వాద్రా పై ఆరోపణలతో కాంగ్రెస్ కు నష్టం
ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న వాద్రా కారణంగా కాంగ్రెస్ వ్యతిరేక పక్షాలకు ఉప్పందిచినట్లయిందని విశ్లేషకులు సైతం భావిస్తున్నారు.
మరోవైపు పార్టీ సీనియర్ నాయకుడు గులాం నబీ ఆజాద్ ను సీడబ్ల్యూసీ లో కొనసాగిస్తూనే ప్రధాన కార్యదర్శి పదవినుంచి తప్పించడం పార్టీ శ్రేయస్సు దృష్ట్యా మంచిది కాదని మెజారిటీ కాంగ్రెస్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
కాంగ్రెస్ పార్టీకి క్రియాశీలక అధ్యక్షుడి అవసరం ఉందంటూ సోనియాగాంధీకి 23 మంది సీనియర్లు లేఖ రాయడం ఇటీవల కలకలం సృష్టించింది.
దీనిపై స్పందించిన రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో కొందరు బీజేపీకి అనుకూలంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఆనంద్ శర్మ, గులాం నబీ ఆజాద్ వంటి పార్టీ విధేయులను అనుమనించడం తగదని కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు, కొన్ని ఉత్తరాది రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు బహిరంగంగా రాహుల్ గాంధీని తప్పుపట్టారు.
వరుస వైఫల్యాలతో కాంగ్రెస్ కకావికలం
వరుస వైఫల్యాలతో ప్రజాభిమానం దూరం చేసుకుంటున్న సమయంలో కాంగ్రెస్ పార్టీలో పునర్వ్యవస్థీకరణ పేరుతో మార్పులు, చేర్పులు చోటుచేసుకోవడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు.
సమీప భవిష్యత్తులో జరగనున్న బీహార్, పాండిచ్చేరి శాసనసభ ఎన్నికలతో పాటు మధ్యప్రదేశ్ తో సహా పలు రాష్ట్రాలలో జరిగే ఉపఎన్నికలు దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ అధిష్టానం కార్యాచరణ ప్రకటించాలని కాంగ్రెస్ మద్దతుదారులు అభిలషిస్తున్నారు.
రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపుగుర్రాలను ఎంపికచేయాలని తద్వారా కేంద్రంలో బీజేపీ, ఇతరచోట్ల నాన్ యూపీఏ కూటమి దూకుడు కు కళ్ళెంవేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం అస్త్రాలు సిద్ధంచేస్తోంది.
పొలమరశెట్టి కృష్ణారావు