విరసం కార్యదర్శిగా ఇటీవలే ఎన్నికైన ప్రొఫెసర్ ఖాసింకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో శనివారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. యూనివర్సిటీ లోని ఆయన క్వార్టర్ డోర్లు పగులగొట్టి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారని ఆయన భార్య స్నేహాలత మీడియాతో తెలిపారు.
ఉదయం నుంచి ఆయన ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. దాదాపు ఐదు గంటలుగా సోదాలు జరిగాయి. ఈ తనిఖీల్లో కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్ డిస్కులు, రెండు బ్యాగుల విప్లవ సాహిత్యం, కరపత్రాలను గజ్వేల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 5 సంవత్సరాల క్రితం జరిగిన కేసులో ఈరోజు గజ్వేల్ పోలీసులు సోదాలు చేశారు. 2016 లో అక్రమంగా బనాయించిన కేసులో ఈరోజు అరెస్ట్ చేశారని స్నేహలత తెలిపారు.
2016 హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ వెళ్తున్న శ్యామ్ సుందర్ అనే వ్యక్తి దగ్గర దొరికిన పుస్తకాల పై కేసు నమోదు చేశారని ఆమె అన్నారు. అనంతరం ప్రొఫెసర్ ఖాసింను పోలీసులు అదుపులోకి తీసుకుని గజ్వేల్కు తరలించారు. కాగా ప్రొఫెసర్ ఖాసిం ఇంట్లో పోలీసుల సోదాలను విద్యార్థులు ఖండించారు. ఓయూలోని ఖాశిం నివాసం ఎదుట విద్యార్థులు ఆందోళనలకు దిగారు.