మద్యపాన నిషేధం అమల్లో కొత్త సవరణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి, అబ్కారీ, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి కె.నారాయణస్వామి అధికారులను ఆదేశించారు. వెలగపూడి సచివాలయం 4వ బ్లాక్ లోని సమావేశ మందిరంలో అనంతపురం, చిత్తూరు, కర్నూలు, కడప, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సంబంధించిన డీసీ, ఏసీ, ఈఎస్, డీఎంలతో ఆయన శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
మద్యపాన నిషేధం అమలులో అవకతవకలకు పాల్పడితే అధికారుల మీద కూడా చర్యలు తప్పదని హెచ్చరించారు. సూపర్ వైజర్, వాచ్ మెన్, సేల్స్ మెన్ లకు ఏజెన్సీల ద్వారా సక్రమముగా జీతాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఐడీ, ఎన్ డీపీఎల్ కేసుల్లో పీడీ యాక్ట్ ను కచ్చితంగా అమలుపరచాలన్నారు.
మద్యం అక్రమ రవాణా వాహనదారుల యజమానుల మీద కూడా కేసులు నమోదు చేయాలని చెప్పారు. బెల్ట్ షాపులను ప్రోత్సహించడం, లిక్కర్ ను ఔట్ లెట్స్ నుండి బార్లకు సరఫరా చేసిన కారణంగా నరసరావుపేట సీఐ ఎం.భుజంగరావును సస్పెండ్ చేస్తూ ఈ మేరకు డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆదేశాలు జారీ చేశారు.
డిప్యూటీ కమిషనర్ (డీసీ) ఆదిశేషులుకు ఎక్స్ ప్లనేషన్ మెమో జారీ చేశారు. భవిష్యత్ లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని, ఒకవేళ ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఉపముఖ్యమంత్రి ఈ సందర్భంగా కోరారు. సమావేశంలో కమిషనర్, డీఐజీ, స్పెషల్ సీఎస్, ఇన్ఫర్మేషన్ డైరెక్టర్, అనంతపురం, చిత్తూరు, కర్నూలు, కడప, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సంబంధించిన డీసీ, ఏసీ, డీఎంలు పాల్గొన్నారు.