వైసీపీని వీడుతున్న సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు. కడప జిల్లాలో సీనియర్ నాయకులు, బలమైన పట్టు ఉన్న నేతలు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. ఈనెల 20న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబు నాయుడి సమక్షంలో టీడీపీలో చేరుబోతున్నట్లు కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి తెలిపారు.
తన కుమారునితో కలసి టీడీపీ తీర్ధం పుచ్చుకోనున్నట్లు ఆయన ప్రకటించారు. జమ్మలమడుగులో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తామని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగురవేసి చంద్రబాబుకు కానుకగా ఇస్తామని పేర్కొన్నారు. అదే జిల్లాలో రాయచోటికి చెందిన బలమైన వైసీపీ నేత త్వరలో టీడీపీ గూటికి చేరబోతున్నారు.
ఇదేకాదు రెండు రోజుల క్రితం జగన్ పాలనపై దుమ్మెత్తిపోసిన మైదుకూరు మాజీ ఎమ్మెల్యే డి.ఎల్.రవీంద్రనాథ్ రెడ్డి, ఎన్నికల అనంతరం వైసీపీలో చేరిన మాజీమంత్రి రామసుబ్బారెడ్డి కూడా తెలుగుదేశం పార్టీ అధినేత పిలుపు కోసం ఎదురు చూస్తున్నట్లు సమాచారం అందుతోంది.
కాంగ్రెస్ తరపున నిత్యం వాదనలకు వినిపిస్తున్న ప్రకాశం జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, చార్టెడ్ అకౌంటంట్ జి.వెంకటరెడ్డి కూడా చంద్రబాబును కలిసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన తన రాజీనామా లేఖను పిసిసి అధ్యక్షుడు సాకె శైలజానాథ్ కు పంపారు.