ఆస్తిపన్ను పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో ఎంఎస్ నెంబర్ 198 ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో ప్రజల తరఫున హైకోర్టులో కేసు వేస్తానని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు.
ఆస్తిపన్ను పెంపు వ్యతిరేక ఉద్యమానికి తిరుపతి నుంచి శ్రీకారం చుట్టాలని ఆయన కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ ఈ ఉద్యమంలో తిరుపతి లోని అన్నీ వర్గాల ప్రజలు,వర్తక సంఘాలు భాగస్వాములు కావాలని ఆయన కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఎంఎస్ నెంబర్ 198 ప్రకారం ఆస్తి పన్ను విధింపు స్టాంప్స్ డిపార్ట్మెంట్ (SUB REGISTAR) వారు నిర్వహించే భవనాలు, వాటి స్థలం మూలధన విలువల (CAPITAL VALUE) ఆధారంగా ఆస్తిపన్ను వేస్తే ప్రజలపై ఎన్నడూ లేనివిధంగా భారం పడుతుందని ఆయన తెలిపారు.
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పోటీలు పడి ధరలు పెంచి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని ఆయన అన్నారు. కరోనా కష్ట కాలంలో ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ధరలు పెంచి పన్నులు వేసి వేధించడం అన్యాయమని ఆయన తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం అర్ధ సంవత్సరం ఆస్తి పన్ను మినహాయింపు ప్రకటించి అన్నీ వర్గాల ప్రజలను ఆదుకోవాలని నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.