మంత్రి వర్గ విస్తరణ పల్నాడు జిల్లా మాచర్లలో మంటలు రగుల్చింది. మాచర్ల నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన పిన్నెల్లి రామకృష్ణరెడ్డికి మంత్రివర్గంలో చోటుకల్పించనందుకు నిరసనగా మండల కేంద్రమైన రెంటచింతల లో ప్రధాన రహదారిపై వైసీపీ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. రోడ్డు పై టైర్లు వేసి తగులబెట్టారు. పిన్నెల్లికి మంత్రి పదవి ఇవ్వనందుకు నిరసనగా ఒక మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది.
పక్కనే ఉన్న కార్యకర్తలు కాపాడడంతో గండం గడిచింది. పల్నాడు జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యే మాచర్ల నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన పిన్నెల్లి రామకృష్ణరెడ్డికి మంత్రివర్గంలో చోటుకల్పించనందుకు నిరసనగా కారంపూడి మండల వైఎస్ఆర్ సీపీ యువజన విభాగం అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు చిలుకూరి చంద్రశేఖర్ రెడ్డి ప్రకటించారు.
సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఫోన్ వెళ్లింది. సీఎం సెక్రటరీ ధనుంజయరెడ్డి నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఫోన్కాల్ వచ్చింది. “మీరు, మీ ప్రభుత్వం చూపిన అభిమానానికి థాంక్స్” అంటూ పిన్నెల్లి ఫోన్ పెట్టేశారు. ఆ తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఫోన్ స్విచ్చాఫ్ చేశారు.
ఎం.ఎస్.సుధాకర్, సత్యంన్యూస్.నెట్, పల్నాడు జిల్లా