సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి అధ్వర్యంలో గురువారం హుజూర్ నగర్ నియోజకవర్గం లోని అన్ని సిమెంట్ కంపెనీల యాజమాన్యాల సమావేశంలో పురపాలక,పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న పరిశ్రమలలో 70 శాతం ఉద్యోగ,ఉపాధి అవకాశాలు స్థానికులకు కల్పించాలని కోరారు. స్థానికులకు ఎక్కువ ఉపాధి అవకాశాలను కల్పించే కంపెనీలకు నూతన పారిశ్రామిక పాలసీ కింద ప్రోత్సాహకాలు,పన్ను మినహాయింపులు వంటి వాటికి ప్రభుత్వం నుండి సంపూర్ణ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. సిమెంట్ పరిశ్రమల అవసరాల కోసం దృష్టి సారించి స్థానిక యువతకు సాంకేతిక రంగంలో రాణించడానికి ఒక నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.హుజూర్ నగర్ లో త్వరలో ఒక పెద్ద పారిశ్రామిక పార్కు ఏర్పాటు అవుతున్నదని అన్నారు.
శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే అంశంలో స్థానిక పారిశ్రామిక యజమాన్యానికి పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. అదే విధంగా అప్రెంటిషిప్ కార్యక్రమాన్ని పునః ప్రారంభించాలని కోరారు.
ఈ సమావేశంలో టిఎస్ఐఐసి చైర్మన్ గాదరి బాలమల్లు,పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్,ఎండి ఇ.వి.నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సత్యం న్యూస్, హుజూర్ నగర్