ప్రముఖ కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ ఆకస్మికంగా మరణించారు. తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో ఉదయం చేరిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. జిమ్ చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన్ను బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు. పునీత్ రాజకుమార్ ఇకలేరన్న వార్త విని ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. భారీగా ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది.
1976లో బాలనటుడిగా కెరీర్ ప్రారంభించిన పునీత్… 1989 వరకు బాలనటుడిగా 13 సినిమాలు చేశారు. ఉత్తమ బాలనటుడిగా నేషనల్ అవార్డును సంపాదించుకున్నారు. 2002లో అప్పూ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన ఆయన.. హీరోగా ఇప్పటివరకు 32 సినిమాల్లో నటించారు. పునీత్ ఉదయం జిమ్ చేస్తుండగా గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన పరిస్థితి విషమించిందని వైద్యులు తెలిపారు. పునీత్ మరణవార్త ఆయన అభిమానులతో పాటు.. కన్నడ నాట తీవ్ర విషాదాన్ని నింపింది.
పునీత్ మృతి నేపథ్యంలో కన్నడ నాట హై అలర్ట్ ప్రకటించారు. ఇక అభిమానుల సందర్శనార్థం పునీత్ పార్థీవ దేహాన్ని కంఠీరవ స్టేడయంలో ఉంచేందుకు కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం పునీత్ రాజ్కుమార్ మృతదేహాన్ని స్టేడియం వద్దకు తరలిస్తున్నారు. కాగా, అంత్యక్రియలు శనివారం.. తండ్రి సమాధి దగ్గరే నిర్వహించనున్నారు. పునీత్ కుమార్తె అమెరికాలో ఉంది.