అధికారంలోకి వచ్చిన క్షణం నుంచి సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్న పంజాబ్ లోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు మరొక ప్రధాన నిర్ణయం తీసుకున్నది. 184 మంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతల భద్రతను ఉపసంహరించుకోవాలని పంజాబ్ పోలీసులను ప్రభుత్వం ఆదేశించింది.
అయితే, కోర్టుల నిర్దిష్ట ఆదేశాలపై ఇచ్చిన రక్షణ సిబ్బందిని మాత్రం ఉపసంహరించడం లేదని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (సెక్యూరిటీ) తన ఆదేశాలలో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసు కమిషనర్లు, సీనియర్ పోలీసు సూపరింటెండెంట్లతో సహా సీనియర్ పోలీసు అధికారులకు ఆదేశాలు అందాయి. ప్రభుత్వ తాజా ఆదేశాలతో ఎందతో ప్రముఖులు చాలా కాలంగా అనుభవిస్తున్న సెక్యూరిటీ కవర్ ను కోల్పొయారు.
మాజీ మంత్రులు సుర్జిత్ కుమార్ రఖ్రా, సుచా సింగ్ ఛోటేపూర్, జనమేజా సింగ్ సెఖోన్, బీబీ జాగీర్ కౌర్, మదన్ మోహన్ మిట్టల్, తోట సింగ్, గుల్జార్ సింగ్ రాణికే భద్రతను కోల్పోయిన వారిలో ప్రముఖులు. మాజీ ముఖ్యమంత్రులు, ఇతర మంత్రుల కుటుంబానికి భద్రతను కూడా ఉపసంహరించుకున్నారు. పంజాబ్ మాజీ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ కుటుంబం, మాజీ సీఎం అమరీందర్ సింగ్ కుమారుడు రణిందర్ సింగ్, పునీత్ కౌర్, మాజీ మంత్రి ఆదేశ్ పర్తాప్ సింగ్ కైరోన్ భార్య, మాజీ ఆర్థిక మంత్రి మన్ప్రీత్ బాదల్ కుమారుడు అర్జున్ బాదల్ కూడా ఈ భద్రత కవర్ ను కోల్పోతారు.
మాజీ MP, IPL మాజీ ఛైర్మన్ రాజీవ్ శుక్లా భద్రతను కూడా పోలీసులు ఉపసంహరించుకున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి స్టార్ క్యాంపెయినర్గా ఉన్న మహి గిల్, మాజీ DGP సిద్ధార్థ్ ఛటోపాధ్యాయ కుమారుడు సిద్ధాంత్ చటోపాధ్యాయ, ఇతర ప్రముఖుల కుటుంబ సభ్యులు అయిన చరణ్జిత్ కౌర్ బజ్వా, కాంగ్రెస్ ఎమ్మెల్యే పర్తాప్ సింగ్ బజ్వా భార్య, ఉదయ్బీర్ సింగ్, మాజీ మంత్రి సుఖ్జిందర్ రంధావా కుమారుడు కు కూడా భద్రత కవర్ ఇక ఉండదు.
పంజాబ్ బీజేపీ ప్రధాన కార్యదర్శి జీవన్ గుప్తా, పంజాబ్ బీజేపీ మాజీ చీఫ్ రాజిందర్ భండారీ, రాజేష్ బగ్గాలకు భద్రతను ఉపసంహరించుకున్నారు.
గోవింద్ సింగ్ లాంగోవాల్, జీత్ మొహిందర్ సింగ్, కరణ్ కౌర్ బ్రార్, బల్బీర్ సింగ్ ఘునాస్, దీప్ మల్హోత్రా, మంతర్ సింగ్ బ్రార్, జోగిందర్ పాల్ జైన్, అరవింద్ ఖన్నా, సరబ్జిత్ మక్కర్లతో సహా మాజీ అకాలీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేల భద్రతను కూడా ఉపసంహరించుకున్నారు.
పంజాబ్ యూత్ కాంగ్రెస్ చీఫ్ బరీందర్ ధిల్లాన్, మాజీ అకల్ తఖ్త్ జతేదార్ గియానీ గుర్బచన్ సింగ్, పాట్నా సాహిబ్ మాజీ జతేదార్ గియానీ ఇక్బాల్ సింగ్, అమర్జిత్ సింగ్ చావ్లా, సుర్జిత్ సింగ్ గర్హితో సహా కొంత మంది SGPC సభ్యులు కూడా తమ భద్రతను కోల్పోయారు.