ఈనెల 13న జరగనున్న శాసనమండలి ఎన్నికల్లో కూడా ఓటర్లను కొనుగోలు చేసే పరిస్థితి ఏర్పడడం దురదృష్టకరమని బీజేపీ నేత విష్ణవర్ధన్ రెడ్డి అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఈ అంశం పై కఠినంగా వ్యవహరించాలని కోరారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. పెట్టుబడుల సదస్సుని ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నిర్వహించకూడదన్నారు.
గత ప్రభుత్వం నిర్వహించిన పెట్టబడుల సదస్సుపై విమర్శలు చేసిన వైసీపీ.. ప్రస్తుత ప్రభుత్వం పెట్టుబడులపై పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. ప్రతి మూడు నెలలకు ఒక్కసారి పెట్టుబడులకు సంబంధించి శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వ్యక్తులను చూసి పెట్టుబడులు రావని, రాష్ట్రంలోని పారిశ్రామిక విధానం, పరిస్థితులని బట్టి పెట్టుబడులు వస్తాయని తెలిపారు.
2 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయని ఐటీ మంత్రి చెప్పారని, ముఖ్యమంత్రి ఏమో 13 లక్షలు పెట్టుబడులు వచ్చాయని ప్రకటించారన్నారు. ఇది ఎలా సాధ్యమైందో ఐటీ మంత్రి సమాధానం చెప్పాలని అన్నారు. జనసేన, బీజేపీ మధ్య పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. కొన్ని పార్టీలు మాత్రం విడిపోవాలని కోరుకుంటున్నాయన్నారు. వారి కోరికలు నేరవేరవని బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి తేల్చిచెప్పారు.