ఏలూరు ప్రభుత్వ వసతి గృహాలలో మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని ఏలూరు రెవిన్యూ డివిజనల్ అధికారి పెంచల్ కిషోర్ వార్డెన్ ను ఆదేశించారు. పెదవేగి మండలం లక్ష్మీపురంలోని డా.బి.ఆర్.అంబెడ్కర్ గురుకుల పాఠశాలలోని ప్రభుత్వ వసతి గృహాన్ని సోమవారం రాత్రి ఆర్డీఓ ఆకస్మికంగా తనిఖీ చేసి, విద్యార్థులతో సహపంక్తి భోజనం చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న భోజనం, మెనూ, వసతిగృహ పరిసరాల పరిశుభ్రత.త్రాగునీరు, రోజువారీగా అందించే ఆహార పదార్థాలపై విద్యార్థులను ఆడిగి తెలుసుకున్నారు. వసతి గృహం లో ఉంటున్న విద్యార్థులకు కాస్మొటిక్స్, ట్రంకు పెట్టెలు, వసతిగృహ యూనిపార్మ్స్ సక్రమంగా అందుతున్నాయా అని అడిగారు. ప్రతీరోజు మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు.
వసతి గృహంలోని కొంతమంది విద్యార్థులు క్రీడల పోటీలలో పాల్గొంటున్నారని, జిల్లా స్థాయి క్రీడల పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనపరచి పోటీలలో గెలుపొందరని తెలుసుకున్న ఆర్డీఓ వారికి అందించే ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ప్రోటీన్లతో కూడిన మరింత పౌష్టికాహారాన్ని అందించాలని వసతి గృహ సిబ్బందికి సూచించారు. వసతి గృహం పరిసరాలలో, టాయిలెట్లలో ఎప్పటికప్పుడు పరిశుభ్రమైన పరిస్థితులు ఉండాలని, దోమలు లేకుండా చర్యలు తీసుకోవాలని వసతి గృహ సిబ్బందిని ఆర్డీఓ ఆదేశించారు.