వినాయక చవితి వేడుకలకు అనుమతి ఇవ్వకపోవడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, నర్సాపురం ఎంపి కె.రఘురామకృష్ణంరాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కి లేఖ రాశారు.
దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రకటన హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని అనేక మంది స్వామీజీలు, హిందూ మత పెద్దలు, హిందూ సమాజం కోసం పాటుపడుతున్న సంస్థలు, హిందువులు తనకు ఫోన్ చేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
మంత్రి ఏకపక్షంగా హిందూ మత పెద్దలను సంప్రదించకుండా నిర్ణయం తీసుకోవడం రాష్ట్రం లోని హిందువులను, హిందూ సమాజాన్ని అవమానపరిచినట్లే అని వ్యాఖ్యానించారు. ‘‘మంత్రి వల్ల మీకు, మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది” అని ఆయన అన్నారు.
ఒక బాధ్యత గల పార్లమెంట్ సభ్యునిగా, హిందువుగా ప్రజల మనోభావాలను మీ దృష్టికి తీసుకురావడం నా బాధ్యత అని ఆయన అన్నారు. రాష్ట్రంలో వివాహాలు, ఇతర శుభకార్యాలకు నిబంధనలతో కూడిన అనుమతులను ఇస్తున్నారు. అవే నిబంధనలను వినాయక చవితి బహిరంగ వేడుకలకు వర్తింపజేస్తూ అనుమతి ఇవ్వాలని ఆయన అన్నారు.