రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్బంగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు కౌశిక్ రెడ్డి ఆయన విగ్రహానికి పూల మాల వేసి ఘన నివాళి అర్పించారు.
అనంతరం కరోనా పేషెంట్లకు భరోసానిచ్చేందుకు హుజురాబాద్, జమ్మికుంట ప్రభుత్వ దవాఖానాలను ఆయన సందర్శించారు. గంటపాటు కోవిడ్ పేషెంట్లున్న వార్డులను కలియతిరిగి వారికి అందుతున్న వైద్య చికిత్స గురించి అడిగి తెలుసుకున్నారు.
కోవిడ్ పేషెంట్లు చికిత్స పొందుతున్న ఐసియు ఔట్ పేషెంట్ వార్డులు సహా, పలు జనరల్ వార్డులలో కౌశిక్ రెడ్డి కలియతిరిగారు. బెడ్ల వద్దకు వెళ్లి పేషెంట్లతో నేరుగా మాట్లాడారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
వైద్య సేవలందిస్తున్న కాంట్రాక్టు నర్సులతో, జూనియర్ డాక్టర్లతో కౌశిక్ రెడ్డి మాట్లాడారు. ప్రాణాలకు తెగించి కరోనా రోగులకు సేవలందిస్తున్నారని వారిని అభినందించారు.
వారికి ఎటువంటి ఇబ్బంది వున్నా పరిష్కరిస్తామని, ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రజల కోసం నిలబడాల్సిన అవసరం వున్నదన్నారు.
‘‘క్లిష్ట సమయంలో ప్రజలకు అండగా వుండి బ్రహ్మాండంగా సేవ చేస్తున్నారు. ఈ సేవలను కొనసాగించండి అంటూ ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం లో సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు కోవిడ్ నిబంధనలు పాటించుకుంటూ పాల్గొన్నారు.