‘ పెద్దలసభ,’ ‘మేథావులసభ’ అని గౌరవంగా పిలుచుకునే రాజ్యసభకు డిప్యూటీ చైర్మన్ ను ఎన్నుకునే ప్రక్రియలో దేశంలోని రాజకీయ పక్షాలు వ్యూహాలు పన్నుతున్నాయి. సెప్టెంబర్ 14 న జరుగనున్న డిప్యూటీ చైర్మన్ పదవి దక్కించునేందుకు బీజేపీ నాయకత్వంలోని ఎన్ డీ ఏ కూటమి ఒకవైపు… కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ మరోవైపు మల్లగుల్లాలు పడుతున్నాయి.
245 సభ్యులు ఉన్న రాజ్యసభ లో డిప్యూటీ చైర్మన్ స్థానం సాధించడానికి మ్యాజిక్ అంకె 123 ను అందుకునే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. గత ఏప్రిల్ లో పదవీకాలం పూర్తిచేసుకున్న తాజా మాజీ డిప్యూటి ఛైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్ (జనతాదళ్-యు) నే ఉమ్మడి అభ్యర్థిగా పోటీలో నిలబెట్టాలని ఎన్ డీ ఏ కూటమి నిర్ధారించినట్లు స్పష్టమవుతోంది.
యూపీఏ ఉమ్మడి అభ్యర్థిగా డిఎంకే పార్టీకి చెందిన అభ్యర్థి కి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభలో తాజాబలాల పై ఉన్న అంచనా ప్రకారం ….87 మంది బీజేపీ సభ్యులతో సహా 117 మందితో ఎన్ డీ ఏ ఉండగా, 40 మంది కాంగ్రెస్ సభ్యులతో కలిపి 127 మంది యూపీఏ పక్షాన ఉన్నట్లు తెలుస్తోంది.
బీజేడీ, బీఎస్పీలది కీలక పాత్ర
అయితే…బీజేడీ, బీఎస్పీ, వైఎస్ ఆర్ సీపీ, టీఆర్ఎస్ కు చెందిన దాదాపు 28 మంది రాజ్యసభ సభ్యులు ఎన్ డీ ఏ పక్ష అభ్యర్థిని బలపరిచే అవకాశం ఉందని బీజేపీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలో బీజేడీ, బీఎస్పీలు కీలకపాత్ర పోషించగలవని రాజకీయ విశ్లేషకుల భావన.
లోకసభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్ ఎన్నికలసమయంలో ఎన్ డీ ఏ ను బలపరచిన నాన్- బీజేపీ, నాన్- కాంగ్రెస్ రాజకీయ పార్టీలు డిప్యూటీ ఛైర్మన్ఎన్నికలలో కూడా సహకరిస్తాయని బీజేపీ నాయకత్వం బలంగా విశ్వసిస్తోంది. కానీ….అప్పటిపరిస్థితులు వేరని, ప్రస్తుతం అటువంటి సానుకూల వాతావరణం లేదని పరిశీలకులు అంటున్నారు.
కోవిడ్ -19 మహమ్మరిని సమర్ధవంతంగా ఎదుర్కోవడంలో కేంద్రప్రభుత్వం ముందుచూపు తో వ్యవహరించని కారణంగా సామాన్య ప్రజలు నేటికీ దుర్భరస్థితిలో ఉన్నారని కాంగ్రెస్ తో గొంతుకలుపుతున్న రాజకీయ పార్టీల సంఖ్య పెరిగింది. జీడీపీ క్షీణతకు ప్రభుత్వం తీసుకున్న అనా లోచిత నిర్ణయాలే కారణమని ప్రతిపక్ష పార్టీలతో పాటు ఆర్థిక వేత్తలు కూడా కొన్ని సందర్భాలలో విమర్శించారు.
మోడీపై అసంతృప్తితో నాన్ బిజెపి రాష్ట్రాలు
మహమ్మారిని ఎదుర్కొనేందుకు అవసరమైన ఆర్థిక సహకారం, మౌలికసదుపాయాల కల్పనకు నిధులు ఇవ్వకపోవడం, జీఎస్టీ అమలు విధానంలో ఒంటెత్తు వైఖరి , సెక్యులర్ భావనలో సంక్లిష్టత వంటి అంశాలపై నాన్- బీజేపీ పాలిత రాష్ట్రాలు అసంతృప్తితో ఉన్నాయి.
సెప్టెంబర్ 14 న జరుగనున్న రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికతో భారత దేశ రాజకీయ గమనం ముడిపడి ఉన్నట్లు రాజ్యాంగ నిపుణులు భావిస్తున్నారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవిని మరోసారి దక్కించుకుని బీజేపీ మరింత బలపడనుందా? ..లేదా నాన్- బీజీపీ రాజకీయపార్టీలను కూడగట్టి పోయినసారి పోయిన పదవిని కాంగ్రెస్ చేజిక్కించుకుంటుందా ? తేలాలంటే….సెప్టెంబర్ 14 వరకు నిరీక్షించక తప్పదు.
మాజీ ప్రధాన ఎన్నికల అధికారి టీ ఎన్ శేషన్ అన్నట్లు…. ” ఎన్నికలలో గెలుపోటముల మాట ఎలా ఉన్నా… భారతదేశంలో ప్రజాస్వామ్యం అనంతంగా పరిఢవిల్లుతూనే ఉంటుంది”.
పొలమరశెట్టి కృష్ణారావు