పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలందరు ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని రాజంపేట MLA, TTD బోర్డు మెంబరు మేడా వేంకట మల్లికార్జున రెడ్డి కోరారు. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉన్నందున ఈ రంజాన్ మాసంలో ముస్లింలందరూ ఇళ్లల్లోనే రంజాన్ ప్రార్థనలు నిర్వహించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇది మనసుకు కష్టమైన మాట అయినా సరే చెప్పక తప్పని పరిస్థితి అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఎదుర్కొంటున్న కరోనా విపత్కర పరిస్థితులు ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమేనని, కరోనా వైరస్ను అధిగమించేందుకు గత కొన్ని రోజులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాయన్నారు.
కోవిడ్-19 నివరణపై చర్యల్లో భాగంగా ప్రధానంగా ప్రతిఒక్కరూ భౌతిక దూరంతో పాటు స్వీయ గృహ నిర్బంధం పాటించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం మార్చి నెల మూడో వారం నుండి లాక్ డౌన్ చేపట్టామని చెప్పారు. ఈ పరిస్థితుల్లో పవిత్రమైన పండుగ పర్వదినాల్లో సైతం దేవాలయాలు, చర్చిల్లో, మజీదుల్లో పూజలు, ప్రార్థనలు సామూహికంగా చేసుకోలేని పరిస్థితులు ఎదురయ్యాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించిన నిబంధనలను ముస్లిం మత పెద్దలు తప్పని సరిగా పాటిచాలని ఆయన ముస్లిం మత పెద్దలను కోరారు. రంజాన్ నేపథ్యంలో మసీదుల నుంచి రోజుకు ఐదుసార్లు అజా ఇచ్చేందుకు ప్రభుత్వం అనుమతించిందన్నారు. అజాకు ముందు, తరువాత కరోనా వైరస్ గురించి హెచ్చరికలు, అవగాహన, ప్రకటనలు తప్పనిసరిగా చేయాలని ముస్లిం మతపెద్దలను ఆయన కోరారు.