విజయనగరం జిల్లాలోని బియ్యం కార్డుదారులందరికి ఫిబ్రవరి 1 నుండి ఇంటివద్దకే వాహనాల ద్వారా రేషన్ అందించే ప్రక్రియ ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. ఎం. హరి జవహర్ లాల్ పేర్కొన్నారు.
ఇప్పటికే వాహనాలు జిల్లాకు చేరు కున్నాయని , ఈ నెల 21 న పిటిసి లో లబ్దిదారులందరికి వాహనాలను కేటాయించనున్నట్లు తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరం లో జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్లు డా.జే.సీ.కిషోర్ కుమార్, డా. మహేష్ కుమార్ రవిరాల, అదనపు ఎస్.పి శ్రీ దేవి రావు తో కలసి మీడియా సమావేశం నిర్వహించారు.
ఇంటింటికి రేషన్ సరఫరా కోసం జిల్లాకు 458 వాహనాలను కేటాయించడం జరిగిందని…. ఈ వాహనాల ద్వారా జిల్లాలోని 778 సచివాలయాల పరిధి లో నున్న 1407 రేషన్ దుకాణాల నుండి ఇంటింటికి రేషన్ అందజేయడం జరుగుతుందని, ప్రతి వాహనం ద్వారా సుమారు 1500 కార్డు దారులకు సరఫరా చేస్తారన్నారు.
వాహనాలను నడిపే ప్రతి ఆపరేటర్ కు ఒక వి.ఆర్.ఓ ను నోడల్ అధికారిగా నియమించామన్నారు. వీరి పర్యవేక్షణ లో రేషన్ సరఫరా జరుగుతుందని తెలిపారు. అలాగే ఆపరేటర్లకు టి షర్టు లను ఏక రూప దుస్తులుగా ఇస్తామన్ని తెలిపారు.
ప్రతి వాహనం రిజిస్ట్రేషన్, ఇన్సురెన్సు , బ్యాంకు ఋణం, తదితర అవసరాలను సంయుక్త కలెక్టర్ (అభివృద్ధి) పర్యవేక్షిస్తారని అన్నారు. పంపిణీ విధానం, ఈ పాస్, తూకం, ఇంటర్ నెట్ వినియోగం తదితర అంశాల పై శిక్షణ ఉంటుందని తెలిపారు. ఆపరేటర్ లు గ్రామాల్లో నున్న డీలర్ లు , వాలంటీర్ ల తోపరిచయాలు చేసుకొని రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకుంటారని, పంపిణీ కి ఒక రోజు ముందే మెటీరియల్ అందజేస్తారని అన్నారు.
కరోనా నిబంధనలతో రెండు రోజుల పాటు శంబర జాతర
ఈ నెల 25, 26 తేదీలలో జరిగే శంబర పోలమాంబ జాతర కరోనా నిబంధనలతో జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఇప్పటికి కరోనా కేసు లు నమోదవుతున్నందున ప్రతి ఒక్కరు తప్ప కుండ మాస్క్ వాడాలని, సోషల్ డిస్టన్స్ పాటించాలని, దేవస్థానం సిబ్బంది క్యూ లైన్ లలో శానిటైజర్లను ఇవ్వాలని అన్నారు.
భక్తులు పరిమిత సంఖ్యలో హాజరయ్యేలా ముందస్తు ప్రచారం చెయ్యడం జరుగుతుందన్నారు. మొక్కుబడులున్న వారు మాత్రమే దర్శనాలకు రావలని పెద్ద ఎత్తున ప్రచారం చెయ్యాలన్నారు.
ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్త్, బారికేడింగ్ తదితర ఏర్పాట్లను పోలీస్ శాఖ చేస్తుందన్నారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి పాపా రావు, పౌర సంబంధాల సహాయ సంచాలకులు డి. రమేష్ పాల్గొన్నారు.