ఎలక్ట్రానిక్ మీడియా సంచలనం, ప్రఖ్యాత జర్నలిస్టు రవిప్రకాష్ ఆరుభాషల్లో న్యూస్ ఛానెళ్లు ప్రారంభించబోతున్నారు.
అంతే కాకుండా నాలుగు భాషల్లో వార్తా పత్రికలను కూడా తీసుకువస్తున్నారు. దసరా నాటికి రవిప్రకాష్ మీడియా ప్రారంభం కాబోతున్నట్లు వార్తలు ఒక్క సారిగా గుప్పుమనడంతో దేశవ్యాప్తంగా చర్చ ప్రారంభం అయింది.
రవిప్రకాష్ ప్రారంభించిన టివి9 ను మైహోం, మోగా సంస్థలు బలవంతంగా లాక్కుని ఆయనను కేసుల పాలు చేసిన విషయం తెలిసిందే. టివి9 ఛానెల్ ను వారికి అడగగానే ఇవ్వనందుకు రకరకాలుగా వేధించిన వారికి మాటలతో సమాధానం ఇవ్వను, చేతల్లో చూపిస్తానని రవిప్రకాష్ అనేక సార్లు చెప్పారు.
18 సంవత్సరాల క్రితం రవిప్రకాష్ టివి9 ప్రారంభించినప్పుడు తెలుగు మీడియా రంగంలో పలు సంచలనాలకు వేదిక అయింది.
తిరిగి ఇప్పుడు మొదలయ్యే మీడియా కొత్తతరం మార్పులకు అద్దంపడుతుందని నిర్వాహకులు అంటున్నారు. ఈ సారి ఎలక్ట్రానిక్ మీడియానే కాకుండా ప్రింట్ మీడియా రంగంలోకి కూడా రవిప్రకాష్ ప్రవేశించడం సంచలనంగా మారింది.
ప్రపంచ మీడియా మొఘల్ రాబర్ట్ మర్డోక్ కుమారుడు జేమ్స్ మర్డోక్ కు చెందిన లుపా టెక్నాలజీస్ రవిప్రకాష్ మీడియా సంస్థలో భాగస్వామిగా చేరినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
మీడియాను, టెక్నాలజీని జోడించి ప్రజారంజకంగా అందించడంలో రవిప్రకాష్ సిద్ధహస్తుడు కావడంతో అంతర్జాతీయ మీడియా కూడా ఆసక్తి చూపుతున్నది. అధికార పార్టీలకు మీడియా సంస్థలు తొత్తులుగా మారిపోయి ఉన్న ఈ కాలంలో స్వతంత్ర మీడియా కోసం రెండు తెలుగు రాష్ట్రాలలోని పాఠకులు, వీక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు.
దసరా నాటికి ఆరు భాషల్లో న్యూస్ ఛానెల్స్, నాలుగు భాషల్లో న్యూస్ పేపర్లను తీసుకురావడంతో తలమునకలై ఉన్న రవిప్రకాష్ తర్వలో అధికారిక ప్రకటన కూడా చేస్తారని తెలిసింది.