38.2 C
Hyderabad
April 29, 2024 20: 31 PM
Slider సినిమా

రికార్డు స్థాయిలో ఎన్.టి.ఆర్ స్మారక నాణెం అమ్మకాలు

#ntrmemorial

హైదరాబాద్ మింట్ లో తయారైన తొలి స్మారక నాణెం ఎన్ .టి .రామారావు గారిది. ఈ నాణెం రెండున్నర నెలల్లో 25,000 అమ్ముడు పోవడం దేశంలోనే సరికొత్త  రికార్డు అని మింట్ చీఫ్ జనరల్ మేనేజర్ వి.ఎన్.ఆర్.నాయుడు చెప్పారు. శనివారం ఎన్.టి.ఆర్ సెంటినరీ కమిటీ చైర్మన్ టి.డి.జనార్దన్ ఏర్పాటు చేసిన సమావేశంలో హైదరాబాద్ మింట్ అధికారులు వి.ఎన్.ఆర్.నాయుడు, శ్రీనివాస్ గండపనేడు, తానాజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయుడు మాట్లాడుతూ దేశంలో స్మారక నాణేల విడుదల 1964 నుంచి ప్రారంభమైంది. 

మొదట జవహర్ లాల్ నెహ్రూ, ఆ తరువాత మహాత్మా గాంధీ లాంటి మహనీయుల నాణేలను కేంద్రం విడుదల చేయడం జరిగిందని, అయితే ఇప్పటి వరకు స్మారక నాణేలలో 12,000 నాణేలు అమ్ముడు పోవడం ఒక రికార్డు అని తెలిపారు. ఆ రికార్డు ను ఎన్.టి.ఆర్. స్మారక నాణెం బ్రేక్ చేసిందని ఆయన తెలిపారు. ఆగష్టు 28న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నాణేన్ని ఢిల్లీలో విడుదల చేశారు. ఆ నెల 29వ తేదీ నుంచి నుంచి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. కేవలం రెండున్నర నెలల్లోనే 25,000 స్మారక నాణేలను విక్రయించడం జరిగిందని నాయుడు చెప్పారు.

కమిటీ చైర్మన్ టి.డి.జనార్దన్ మాట్లాడుతూ, అన్న ఎన్ .టి .ఆర్ పేరుతో ఏ కార్యక్రమం మొదలు పెట్టిన నిర్విఘ్నంగా జరుగుతుందని చెప్పారు. అన్న గారి శతాబ్ది సంవత్సరంలో తమ కమిటీ, ఎన్.టి.ఆర్.శాసన సభ ప్రసంగాలు, ఎన్.టి.ఆర్ చారిత్రిక ప్రసంగాలు, శకపురుషుడు ప్రత్యేక సంచికను వెలువరించిందని తెలిపారు. విజయవాడ, హైదరాబాద్ లో రెండు కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించి అన్న గారికి ఘనమైన నివాళి అర్పించామని ఆయన అన్నారు.

ఇప్పుడు ఎన్ .టి .ఆర్ .స్మారక నాణెం రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయని  తెలిసి ఎంతో సంతోషిస్తున్నామని ఆయన తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు 200 నాణేలను విడుదల చెయ్యగా,అందులో అన్నగారి స్మారక నాణెం ప్రథమ శ్రేణిలో ఉండటం మాకు గర్వకారణం, ఇది గిన్నెస్ రికార్డు సృష్టించాలని మేము కోరుకుంటున్నామని జనార్దన్ చెప్పారు.

శ్రీనివాస్ గుండపనేడు మాట్లాడుతూ, రామారావు గారంటే మా అందరికీ అభిమానం, కేంద్రం వారి స్మారక నాణెం విడుదల చెయ్యాలని సంకల్పించిందని మాకు సమాచారం రాగానే హైదరాబాద్ మింట్ లో పనిచేసే మాకు ఎంతో సంతోషం కలిగింది. ఎందుకంటే ఇది హైద్రాబాద్ లో తయారు కాబోతున్న  తొలి నాణెం. చీఫ్ జనరల్ మేనేజర్ నాయుడు పర్యవేక్షణలో అనేక నమునాలను చేసి అత్యుత్తమ డిజైన్ ను ఎంపిక చేయడం జరిగింది. ఇది అందరికీ నచ్చడం మాకు ఎంతో సంతృప్తిని కలిగించిందని చెప్పారు.

తానాజీ మాట్లాడుతూ తాను తెలుగు వాడిని కాదని చెబుతూ రామారావు గారి గురించి  విన్నాను అని తెలిపారు. వారి స్మారక నాణెం హైదరాబాద్ మింట్ నుంచి వస్తున్నదంటే ఎంతో మంది దృష్టి ఉంటుంది. అందుకే ఎలాంటి విమర్శలు, అసంతృప్తులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామని, కృషి ఫలించిందని  చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కంఠంనేని రవి శంకర్, భగీరథ, విక్రమ్ పూల, దొప్పలపూడి రామ్ మోహన్, మండవ సతీష్ పాల్గొన్నారు.

Related posts

అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఆదర్శ ప్రజానాయకుడు ప్రకాశం

Satyam NEWS

మానవత్వంతో ఆడుకున్న సైకిల్ బ్యాచ్

Satyam NEWS

సెకండ్ వేవ్ ఉధృతిని వ్యాక్సిన్లు అడ్డుకోగలవా…..?

Satyam NEWS

Leave a Comment