పర్మిషన్ ఇచ్చారు కదా అని ఇష్టం వచ్చినట్లు ఉంటామంటే కుదరదు. కోవిడ్ నిబంధనలను బేఖాతరు చేసినందుకు హైదరాబాద్ లోని రిజైన్ స్కై బార్ ను పోలీసులు సీజ్ చేశారు.
బార్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చివరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి వీడియో చేరింది. దాన్ని ఆయన ఎక్సయిజ్ శాఖకు పంపి దర్యాప్తునకు ఆదేశించారు.
దాంతో ఎక్సయిజ్ శాఖ బార్ పై రైడ్ నిర్వహించింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా బార్లో పనిచేసే వెయిటర్లు మాస్క్ లు ధరించలేదని అధికారులు గుర్తించారు.
బార్ కౌంటర్ దగ్గర పరిమితికి మించి జనం గుమిగూడారని నిర్ధారణకు వచ్చారు. కస్టమర్లు, సిబ్బందిని ప్రమాదంలోకి నెట్టే విధంగా యాజమాన్యం నిర్లక్ష్యం వహించిందని ఒక నిర్ణయానికి వచ్చారు.
దాంతో తెలంగాణా ఎక్సయిజ్ చట్టం సెక్షన్ 31 (1), 41, ఏపీ ఎక్సయిజ్ రూల్స్ 2005 లోని రూల్ 33, 38 ప్రకారం బార్ యాజమాన్యంపై కేస్ నమోదు చేశారు. బార్ ను సీజ్ చేశారు.