ఇండోనేషియాలో ఫుట్బాల్ మ్యాచ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో కనీసం 174 మంది మరణించారు. డజన్ల కొద్దీ గాయపడ్డారు. తూర్పు జావాలోని మలాంగ్ రీజెన్సీలోని కంజురుహాన్ స్టేడియంలో శనివారం రాత్రి ఇండోనేషియా టాప్ లీగ్ BRI లిగా-1 ఫుట్బాల్ మ్యాచ్ సందర్భంగా ఈ సంఘటన జరిగింది. తూర్పు జావా ప్రావిన్స్కు చెందిన పోలీసు చీఫ్ నికో అఫింటా విలేకరులతో మాట్లాడుతూ అరెమా ఎఫ్సి, పెర్సెబయా సురబయా మధ్య ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతోందని చెప్పారు.
ఓడిపోయిన జట్టు అరెమా మద్దతుదారులు రంగంలోకి దిగి విధ్వంసం సృష్టించారు. పోలీసు అధికారులు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి భాష్పవాయు గోళాలను ప్రయోగించవలసి వచ్చింది. జరిగిన తొక్కిసలాటలో 174 మంది మరణించారు. 34 మంది స్టేడియంలో మరణించగా, మిగిలిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఇండోనేషియా ఫుట్బాల్ అసోసియేషన్ (PSSI) ఆలస్యంగా విడుదల చేసిన ఒక ప్రకటనలో అరేమా మద్దతుదారుల చర్యలకు విచారం వ్యక్తం చేసింది.
బాధిత కుటుంబాలకు క్షమాపణలు చెప్పారు. ఈ ఘటనపై వెంటనే విచారణ బృందాన్ని ఏర్పాటు చేశారు. BRI లిగా-1 అన్ని మ్యాచ్లను ఒక వారం పాటు నిలిపివేశారు. అరేమా ఎఫ్సి జట్టు ఈ సీజన్లో ఆతిథ్యం ఇవ్వకుండా కూడా నిషేధించారు. కేవలం 38 వేల మంది మాత్రమే సీటింగ్ కెపాసిటీ ఉన్న స్టేడియానికి 42 వేల టిక్కెట్లు ఇచ్చారు. ఇండోనేషియా ఫుట్బాల్ మ్యాచ్ల సమయంలో తొక్కిసలాటలు, విధ్వంసాలు జరగడం పరిపాటిగా మారింది. క్లబ్ల మధ్య బలమైన పోటీ కారణంగా, మద్దతుదారులు కొన్నిసార్లు హింసాత్మకంగా ప్రవర్తిస్తుంటారు. వచ్చే ఏడాది మే, జూన్లో ఇండోనేషియా FIFA U-20 ప్రపంచ కప్కు ఆతిథ్యం ఇవ్వనుంది.