శ్రీకాకుళం నగరంలో శుక్రవారం నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరచి ఉంచేందుకు వ్యాపార వర్గాలు అంగీకరించాయి. శ్రీకాకుళం నగర వర్తకులతో జిల్లా కలెక్టర్ జె నివాస్ గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ శ్రీకాకుళం నగరం హై రిస్క్ లో ఉందన్నారు. రోజుకు నమోదు అవుతున్న కేసుల్లో శ్రీకాకుళం నుండి దాదాపు 30 శాతం పాజిటివ్ కేసులు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయని, యువత కూడా ఐసియులో ఉంటున్న పరిస్థితి నెలకొందని ఆయన చెప్పారు.
బుధవారం జిల్లాలో 1,444 కేసులు నమోదు కాగా శ్రీకాకుళంలో 400 కేసులు నమోదు అయ్యాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, చేతులు తరచూ శుభ్రం చేసుకోవాలని ఆయన సూచించారు.
సినిమా హాళ్లను 50 శాతం సామర్ధ్యంతో మాత్రమే నడపాలని ఆయన ఆదేశించారు. ఓబిఎస్ మార్కెట్ ను 80 ఫీట్ రహదారికి మార్పు చేస్తున్నట్లు చెప్పారు. ఆదివారం పూర్తిగా మూసివేయుటకు సహకరించాలని ఆయన కోరారు. నగర పరిధికి అవతల (అవుట్ స్కర్ట్స్) అనధికారిక వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
కొన్ని దుకాణాలలో వెనుక వైపు నుండి వ్యాపారం చేసే వారి పైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ చెప్పారు. పోలీసు సూపరింటెండెంట్ అమిత్ బర్దార్ మాట్లాడుతూ చరిత్రలో గత సంఘటనలు పరిశీలిస్తే సెకండ్ వేవ్ , మూడవ విడత తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నారు.
గతంలో అవగాహన లేదు, ప్రసార మాధ్యమాలు లేవు, ప్రస్తుతం సాంకేతికత ఉందని, ప్రతి విషయం త్వరగా వ్యాపిస్తుందని అన్నారు. యువత స్పందించాలని ఆయన పిలుపునిచ్చారు. అందరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. మాస్కు, ఫేస్ షీల్డ్ ధరించాలని ఆయన కోరారు.
అందరికి వాక్సినేషన్ జరిగితే కేసులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది ఆయన పేర్కొన్నారు. మద్యం దుకాణాలు, రెస్టారెంట్లు, చిన్న దుకాణదారులు తదితర ప్రతి దుకాణదారు వాక్సినేషన్ కోసం దుకాణాలకు వచ్చే వినియోగదారులలో అవగాహన కల్పించాలని ఆయన చెప్పారు.
మద్యం దుకాణాలు, రెస్టారెంట్లు, చిన్న చాట్ బళ్ల వద్ద వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. కరోనా వ్యాప్తి నివారణకు వ్యాపార వర్గాల సహకారం ఎంతో అవసరం అన్నారు.