ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీశ్రీ పైడితల్లి ఉత్సవ నేపథ్యంలో సంబంధిత ఏర్పాట్లపై విజయనగరం ఆర్డీవో సూర్యకళ సంబంధిత విభాగాల అధికారులు, ఆలయ కమిటీ సభ్యులతో శుక్రవారం తన ఛాంబర్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు సమష్టి కృషి అవసరమని, ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
అక్టోబర్ 9, 10, 11వ తేదీల్లో జరగబోయే అమ్మవారి పండుగలో అనుసరించాల్సిన విధి విధానాలపై, సంప్రదాయాలపై, గత ఏడాది జరిగిన విశేషాలను, అమలు పరిచిన విధానాలను ఆలయ ఈవో కిశోర్ కుమార్ ముందుగా వివరించారు. అనంతరం ఆయా శాఖల పరిధిలో తీసుకునే చర్యల గురించి, నిర్వర్తించాల్సిన బాధ్యతల గురించి సంబంధిత అధికారులు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆర్డీవో సూర్య కళ మాట్లాడుతూ గతంలో జరిగిన పొరపాట్లను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది మళ్లీ అలాంటివి పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు, పోలీసు అధికారులు సమన్వయంతో వ్యవహరించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్త వహించాలని చెప్పారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ముందుగానే సమాచారం తెలిసేలా ఎక్కడికక్కడ ఇండికేటర్స్ పెట్టాలని సూచించారు.
ప్రధానంగా ఆలయ దర్శనానికి వచ్చే భక్తులకు క్యూలైన్లలో తాగునీరు, ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. వృద్ధులను, వికలాంగులను దృష్టిలో ఉంచుకొని వారి దర్శనానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రముఖుల దర్శనాల సమయంలో సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని చెప్పారు. క్యూలైన్లలో ఎండ తగలకుండా చలువ పందిర్లు వేయాలని పేర్కొన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, బయో టాయిలెట్లను ఏర్పాటు చేయాలని సూచించారు.
కంట్రోల్ రూమ్ ద్వారా సేవలు
పండగ మూడు రోజుల పాటు భక్తులకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు, భద్రతా ప్రమాణాలు పాటించేందుకు అనుగుణంగా మెయిన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆర్డీవో సూచించారు. అలాగే సరిమానోత్సవం రోజు ప్రత్యక్ష ప్రసారం ఇవ్వాలని, నగరంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్క్రీన్ల ద్వారా భక్తులు చూసేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పారు.
దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి సమాచారం ఇచ్చేందుకు అనుగుణంగా ప్రధాన కూడళ్లలో, ఆర్డీసీ కాంప్లెక్సు వద్ద హెల్ప్ లైన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఉత్సవ నేపథ్యంలో తీసుకొనే అనేక అంశాలపై ఆర్డీవో సూచనలు చేశారు. సమన్వయంతో ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిద్దామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ సమావేశంలో సిరిమాను పూజారి వెంకటరావు, ఆలయ కమిటీ సభ్యులు, వివిధ విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.