ఉత్తరాంద్ర కల్పవల్లి,విజయనగరం ఇలవేల్పు శ్రీశ్రీశ్రీపైడితల్లిఅమ్మవారి ఉత్సవాలను ప్రజల మనోభావాలకు తగ్గట్టుగా , ప్రశాంతంగా జరిగేలా చూడాలని రాష్ట్ర మున్సిపల్, పట్టణాభి వృద్ధి శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అయితే కరోనా నిబంధనలను తప్పకుండా పాటించేలా చూడాలని స్పష్టం చేసారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయం లో అమ్మవారి ఉత్సవాల ఏర్పాట్ల పై సంబంధిత అధికారులతో మంత్రి సమీక్షించారు.
ప్రజలంతా ఉత్సవాలను లైవ్ లో వీక్షించేలా నగరం లో 30 చోట్ల స్క్రీన్లను ఏర్పాటు చేయాలన్నారు. అమ్మవారి గుడి ఎదురుగా భక్తులు మొక్కులు తీర్చుకునే ఘటాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని సూచించారు. సిరిమానును గుడికి తెచ్చే క్రమం లో దారిలో మహిళలంతా దర్శనాలు చేసుకొని పూజలు చేస్తారని, వారందరినీ అక్కడే అనుమతించాలని అన్నారు.
సిరిమాను వద్ద వీలున్నంత తక్కువ మంది ఉండేలా చూడాలని, సమయ పాలన పాటించి సాయంత్రం 3 గంటలకే ఖచ్చితంగా మొదలు పెట్టి 5 గంటల లోగా పూర్తి అయ్యేలా చూడాలని అన్నారు. కరోనా ఉన్నందున సోషల్ డిస్టన్స్ పాటించేలా చూడాలని సూచించారు. ఎలాంటి విమర్శలకు తావు లేకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ వారు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
ఉచిత , ప్రత్యెక, వి.ఐ.పి దర్శనాలు ఉంటాయని , అందరిని అనుమతించాలని స్పష్టం చేసారు. పండగ రోజున బయట ప్రాంతాల నుండి బస్సు లు సిటీ లోనికి అనుమతించవద్దని ఆర్.టి.సి అధికారులకు సూచించారు. అధికారులంత సమన్వయం తో పని చేసి ఉత్సవాలను విజయవంతంగా, ప్రశాంతంగా నిర్వహించాలని అన్నారు.
ఈ సమావేశం లో జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు, జిల్లా కలెక్టర్ సూర్య కుమారి, ఎస్.పి దీపిక, ఏఎస్పీలు సూర్యనారాయణరాజు, సత్యనారాయణరావు, ఆర్.డి.ఓ భవాని శంకర్, దేవస్థానం ఈ.ఓ కిషోర్ కుమార్ , డి.ఎస్.పీ లు అనిల్ కుమార్, మోహన రావు, స్పెషల్ బ్రాంచ్ సీఐలు శ్రీనివాసరావు,రాంబాబు,వన్ టౌన్ సీఐ మురళీ,టూటౌన్ సీఐ లక్ష్మణరావు,రూరల్ సీఐ మంగవేణిలు పాల్గొన్నారు.