ప్రభుత్వ పథకాలు రాలేదని ప్రశ్నిస్తే కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి దౌర్జన్యం చేస్తున్నారని బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి, నెహ్రూ యువకేంద్ర నేషనల్ వైస్ చైర్మన్ యస్.విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు.
రాజుపాలెం మండలంలో ప్రభుత్వ పథకాలు అందడం లేదని లబ్ధిదారులు స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినందుకు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు అనుచరుడు వైసీపీ నేత రవీంద్రా రెడ్డి, ఇతర నాయకులతో కలసి కత్తులతో దాడి చేసి బీజేపీ నేతలను తీవ్రంగా గాయపరిచారని ఆయన తెలిపారు.
ఈ సంఘటనలో బీజేపీ పార్టీ కార్యకర్తలు ప్రసాద్, నర్సింహులు ను కత్తులతో పొడిచి తీవ్రంగా గాయపరిచారని ఆయన వివరించారు.
ఈ సంఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించి దోషులును శిక్షించాలని, లేనిపక్షంలో బీజేపి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతుందని ఆయన హెచ్చరించారు.
ప్రొద్దుటూరు ఎమ్మెల్యే పై కేసు నమోదు చేయాలని, సంఘటనకు కారణమైన ప్రతి ఒక్కరిపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిజిపి ని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.
సామాజిక మాధ్యమాల్లో ఎమ్మెల్యే అవినీతిని ప్రశ్నించాడని ఆయన ప్రవేటు గూండాలు ఒకరిని హత్య చేశారని, నేడు బిజెపి నేతలు, కార్యకర్తలపైన దాడి చేశారని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు.
ప్రొద్దుటూరులో అమలు చేస్తున్నది భారత రాజ్యాంగమా? లేక MLA రాచమల్లు రాజ్యాంగమా? అని ఆయన ప్రశ్నించారు.