కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని పాత బాన్సువాడ, వర్ని, బీర్కూరు లలో ఏర్పాటు చేసిన వానాకాలం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, అడిషనల్ కలెక్టర్ చంద్రమోహన్, బాన్సువాడ RDO రాజా గౌడ్, బోధన్ RDO రాజేశ్వర్, కామారెడ్డి జిల్లా రైతుబంధు అధ్యక్షుడు అంజిరెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి స్పీకర్ పోచారం మాట్లాడుతూ తెలంగాణ వచ్చే నాటికి రాష్ట్రంలో అన్ని రకాల పంటల దిగుబడులు 1.10 కోట్ల టన్నుల ఉంటే నేడు 3 కోట్ల టన్నులకు చేరుకున్నాయి. ఇందులో 1.50 కోట్ల టన్నులు వరి ధాన్యం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన 2014 లో రాష్ట్రంలో వరి ధాన్యం దిగుబడి 30 లక్షల టన్నులు మాత్రమే. ఈ వానాకాలంలో 65 లక్షల ఎకరాలలో వరి పంట సాగు చేశారు.
ఎకరాకు వరి ధాన్యం సగటు దిగుబడిలో బాన్సువాడ నియోజకవర్గం రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్నదని తెలిపారు. ఈ వానాకాలం రాష్ట్రంలో మొత్తం 7000 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా కామారెడ్డి జిల్లాలో 349 కేంద్రాలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. బ్యాంకుల రుణాలు, ప్రవేటు వ్యాపారుల అప్పులతో కాదు స్వంత పెట్టుబడితో వ్యవసాయం చేసుకునే స్థితికి రైతులు ఎదగాలని ఆయన వివరించారు.