గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని పెద్ద దేవాడ గ్రామం వద్ద వేసిన తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోయిన విషయం విదితమే. దీంతో బిచ్కుంద, పుల్కల్, వాజిద్ నగర్, బాన్సువాడ కు రాకపోకలు నిలిచిపోయాయి.
సోమవారం పుల్కల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆశా కార్యకర్తలకు నెలవారి సమావేశం ఉండటంతో మండలంలోని ఆశా కార్యకర్తలు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా నీటిలో నుండి గ్రామస్థుల సహాయంతో వాగు దాటి సమావేశానికి వెళ్లారు. చుట్టూరా తిరిగి వెళ్లాలన్నా డబ్బులతో సహా సమయం వృధా అవుతుందని 35 కిలోమీటర్లు ఎక్కువ ప్రయాణం చేయాల్సి వస్తుందని ఇలా ప్రాణాలకు తెగించి ప్రమాదకరం అని తెలిసి కూడా వాగు దాటి వెళ్లారు.
సోమవారం ఎగువ కురిసిన వర్షాలకు వరద నీరు ఎక్కువై వరద ఉధృతికి వారు కొట్టుకుపోయే ఆస్కారం ఉండేదని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నీటి లో నుండి ప్రజలు వెళ్లకుండా హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయడమే కాక పోలీసులను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.