ముఖ్యమంత్రిగా వై ఎస్ రాజశేఖరరెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తప్పు పట్టడం దారుణమైన విషయమని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు అన్నారు.
వై ఎస్ రాజశేఖరరెడ్డి అమర్ రాజా బ్యాటరీస్ కు అదనపు భూమిని ఇచ్చారని, ఆయన నిర్ణయాన్నే సజ్జల రామకృష్ణారెడ్డి తప్పు పడుతున్నారని రఘురామకృష్ణంరాజు అన్నారు. అమర్ రాజా బ్యాటరీస్ పరిశ్రమ తరలింపు నిర్ణయాన్ని ఈ నెల 25 వరకూ ఆపాలని ఆయన కోరారు.
ఆగస్టు 25న (జగన్ బెయిల్ రద్దు పిటిషన్ విచారణ రోజు) కొంత మంచి జరుగుతుందనే నమ్మకం రాష్ట్ర ప్రజలకు ఉందని ఆయన అన్నారు. అందువల్ల ఫ్యాక్టరీ తరలింపును తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని రఘురామకృష్ణంరాజు కోరారు.
అమర్ రాజా బ్యాటరీస్ అంశం రాష్ట్రంలో అందరిని కలచి వేస్తున్నదని రఘురామకృష్ణంరాజు అన్నారు. అమర్ రాజా బ్యాటరీస్ ను తామే వెళ్లిపొమ్మని చెప్పామని సజ్జల రామకృష్ణారెడ్డి అనడం దురదృష్టకరమని రఘురామకృష్ణంరాజు తెలిపారు.
వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఆ పరిశ్రమలో కాలుష్యం లేదని, ఒక వేళ కాలుష్యం ఉంటే రాజన్న రాజ్యంలో రాజశేఖరరెడ్డి, నాటి కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కళ్లు మూసుకుని కూర్చున్నారని సజ్జల అభిప్రాయమా అని రఘురామ ప్రశ్నించారు.
కాలుష్య నియంత్రణ మండలి వ్యవహారాలపైన కూడా సజ్జల రామకృష్ణారెడ్డే మాట్లాడతారా అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి తరపున సజ్జల మాట్లాడుతున్నారని, హోం మంత్రి చేయాల్సిన పనులు కూడా చేసేస్తున్నారని రఘురామ అన్నారు.
సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుడు మీ కంపెనీల్లో రూ.45 కోట్లు పెట్టుబడులు పెట్టినందుకు ఇలా అన్నింటిపైనా మాట్లాడే అవకాశం ఇచ్చేస్తున్నారా? అని రఘురామ ముఖ్యమంత్రి జగన్ ను ప్రశ్నించారు.