కనీస వేతనం సవరించడంలో కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం,రాష్ట్రం లోని టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందాయని జిల్లా సి ఐ టి యు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి అన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్ళచెరువు మండలం రాంపురం గ్రామంలోని ప్రియా సిమెంటు ఫ్యాక్టరీ వద్ద కృష్ణపట్టే ఏరియా సిమెంటు క్లస్టర్ కమిటీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ అనంతరం,బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా రోషపతి మాట్లాడుతూ వేతన చట్టాన్ని సవరించి కనీస వేతనం 24 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన ఏడు సంవత్సరాల నుండి ఒక్కసారి కూడా వేతన సవరణ జరగలేదని అన్నారు.గురువారం హైదరాబాదులోని కార్మిక శాఖ కార్యాలయం ఎదుట తలపెట్టిన ధర్నా విజయవంతం చేయటానికి కార్మికులు కదిలి వెళ్లారని కోరారు.
పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, కాంట్రాక్ట్ కార్మికులకి నెలకి 26 రోజులు పని కల్పించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రియా సిమెంట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు తీగల శ్రీను, అజారుద్దీన్, ప్రకాష్, లక్ష్మయ్య, నాగేశ్వరరావు,తదితర కార్మికులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్.