తమ డిమాండ్లు పరిష్కరించాలని సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరసన దీక్షలు 10 వ రోజుకు చేరాయి. నేడు కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్యోగులు భిక్షాటన చేపట్టి నిరసన తెలిపారు. అటువైపుగా వెళ్తున్న వాహనదారుల వద్ద భిక్షాటన చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. రెగ్యులరైజేషన్ అనేది భిక్ష కాదని, అది తమ హక్కు అన్నారు. అన్ని శాఖల ఉద్యోగులు మాదిరిగానే తమను కూడా రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు.
లేకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. చాలీచాలని జీతాలతో జీవితాన్ని నెట్టుకొస్తున్నామన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే కనీస భద్రత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షులు దామోదర్, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ ప్రతినిధులు శ్రీధర్ కుమార్, భాను, రోబో శీను, వీణ, సంపత్, రాములు, శైలజ, శ్రావణ్, కాళిదాస్, సంజీవులు, సంధ్య, తదితరులు పాల్గొన్నారు.