సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల జెఏసి సమావేశం విజయవాడలో ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి జెఏసి గౌరవ అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు వివిధ సంఘాల నాయకులు, ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న విధానంపై సుదీర్ఘంగా చర్చించారు.
ఉద్యోగుల వేతనాల పెంపుపై ప్రభుత్వ నిర్ణయాన్ని ఆహ్వానిస్తూనే, ఇతర విభాగాలు కూడా వేతనాలు వెంటనే పెంచేలా ఒత్తిడి చేయాలని సమావేశం అభిప్రాయపడింది. వివిధ దశల్లో పోరాటాలు నిర్వహించాలని సమావేశం తీర్మానం చేసింది, అందులో భాగంగా మార్చి నెలలో వివిధ రాజకీయ పార్టీలకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు, అధికారులకు వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు. ఇంకా సమస్యల పరిష్కారానికి ఉద్యోగులను భాగస్వామ్యం చేస్తూ సంతకాల సేకరణ చేయాలని, జిల్లా సమావేశాలు నిర్వహించాలని సంఘాల నాయకులు నిర్ణయించారు. అదేవిధంగా ఏప్రిల్ 5వ తేదీన వేల మందితో విజయవాడలో ఒక పెద్ద సదస్సు నిర్వహించి, ప్రభుత్వ పెద్దలు, విద్యాశాఖ మంత్రి గారిని, ఉన్నతాధికారులను ఆహ్వానించాలని నిర్ణయించడం జరిగింది.