దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలలో కొంత సడలింపులు ఇచ్చిన క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణాలో నిర్మాణ రంగానికి మినహాయింపు ఇచ్చిందని అందుకే శాండ్ ట్యాక్సీ విధానాన్ని అమలు చేస్తున్నట్లు నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు.
నల్లగొండ సబ్ డివిజన్ పరిధిలోని అన్ని ఇసుక రిచ్ ల నుండి ఇసుక రవాణాకు జిల్లా కలెక్టర్ అనుమతి ఇచ్చారని ఆయన వివరించారు. సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
గతంలో మాదిరిగా ఆన్ లైన్ విధానంలో ఇసుక ట్రాక్టర్ల బుకింగ్ చేసుకోవచ్చని, ప్రభుత్వం నిర్దేశించిన ధరల ప్రకారమే చెల్లింపులు చేయాలని ఆయన చెప్పారు. శాండ్ టాక్సీ విధానాన్ని పటిష్టంగా అమలు చేస్తామని చెప్పారు. ప్రజలు దళారులను ఆశ్రయించి కేసుల పాలు కావద్దని కోరారు. ఇసుక అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పిన ఆయన అన్ని ఇసుక రీచ్ లు, సంబంధిత గ్రామాలలో ఏర్పాటు చేసిన సిసి కెమెరాలను ఆయా పోలీస్ స్టేషన్లకు అనుసంధానం చేశామని తెలిపారు.
శాండ్ టాక్సీ లో రిజిస్టర్ చేసుకున్న ప్రతి ట్రాక్టర్ కదలికలు, ఇసుక అక్రమ రవాణా చేసే వారి కదలికలను నిరంతరాయంగా పర్యవేక్షించడం ద్వారా అక్రమ రవాణా చేసే వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రజలంతా శాండ్ టాక్సీ విధానంలో ఇసుక బుకింగ్ చేసుకోవడం ద్వారా తమతో సహకరించాలని ఆయన కోరారు.