అటవీ భూముల ఆక్రమణకు పాల్పడితే కఠినచర్యలు వుంటాయని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్, ఐడిఓసి లోని సమావేశ మందిరంలో అధికారులతో అటవీ రక్షణ, అటవీ రెవిన్యూ సమస్యలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అడవిపై ఆధారపడి, దానిపై జీవనం సాగిస్తున్న వారికి హక్కులు కల్పించడానికి ఆర్వోఎఫార్ చట్టం రూపొందించారని అన్నారు. ఈ చట్టం క్రింద మొదటి విడతలో 5644 మందికి పట్టాలు ఇవ్వగా, రెండో విడతలో 6500 మందికి పట్టాలు ఇచ్చామన్నారు.
పోడు సమస్యకు శాశ్వత పరిష్కా, ఇకపై ఒక ఇంచు అటవీ భూమి ఆక్రమణకు గురికాకుండా చూడడానికి ప్రభుత్వం ఈ చట్టం తెచ్చిందన్నారు. ఈ చట్టంపై ఇప్పటికే అన్ని పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి, వారినుండి అటవీ రక్షణ కు హామీపై తీర్మానం తీసుకున్నట్లు, పీసా గ్రామసభలు నిర్వహించి అటవీ రక్షణ హామీపై తీర్మానం తీసుకున్నట్లు, అటవీ రక్షణపై సంబంధిత సర్పంచ్ ను బాధ్యునిగా చేసినట్లు ఆయన అన్నారు. ఒక్క చెట్టు నరకివేతకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
అర్హులందరికీ పోడు పట్టాలు ఇచ్చి, హక్కులు కల్పించినట్లు, కొత్త పోడు ఇకపై ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల వారిని మభ్యపెట్టి, అమాయకుల నుండి డబ్బులు తీసుకొని, పొడుకు ప్రోత్సహిస్తున్నట్లు, వారిని మోసం చేస్తున్నట్లు, ఇటువంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని, ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేస్తామని, వీరిపట్ల జాగ్రత్తగా ఉండాలని, వీరి మాయలో పడవద్దని కలెక్టర్ అన్నారు. అడవులను కాపాడే బాధ్యత మనందరిపై ఉందని, ఎవరు అడవుల జోలికి. వెళ్లవద్దని ఆయన తెలిపారు.
ఇప్పటికే పట్టాలు పొందిన వారు,అదనంగా పోడుకు పాల్పడితే, వారికి ఉన్న పట్టాలను రద్దు చేయడం, కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు. పోడు పట్టాలు ఉన్న వారికి సాధారణ పట్టాలు ఉన్న రైతులు పొందే రైతుబంధు, రైతుభీమా తదితర అన్ని పథకాలు పొందుతారని ఆయన తెలిపారు. హరితహారం క్రింద జిల్లాలో 1.30 కోట్ల మొక్కలు నాటినట్లు, వీటిని కాపాడుకోవాలన్నారు. అవెన్యూ ప్లాంటేషన్ క్రింద మొక్కలు నాటినట్లు, కొన్ని చోట్ల రైతులు నీడ వస్తుందని, ఇండ్ల ముందు కొన్నిచోట్ల మొక్కలను పీకేయడం, కాల్చడం, నరకడం చేస్తున్నారని, అనుమతి లేకుండా ఇలా చేస్తే, వాల్టా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
ముఖ్యమంత్రి గిరివికాసం క్రింద రూ. 8.66 కోట్లతో బోర్లు, విద్యుత్, మోటార్లు అందజేసినట్లు ఆయన తెలిపారు. ఆర్వోఎఫార్ క్రింద ఆర్వోఎఫార్ చివరి పాయింట్ వరకు త్రీ ఫెస్ లేనిచోట ఇచ్చుటకు చర్యలు చేపడుతున్నట్లు, సాగుకు అవసరమయ్యే అన్ని సౌకర్యాల కల్పన చేయనున్నట్లు ఆయన అన్నారు. ఆర్వోఎఫార్ క్రింద ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తామని కలెక్టర్ అన్నారు. పంట అయ్యాక పాత పంటను కాల్చడం చేస్తున్నారని, దీంతో వాతావరణ కాలుష్యం తోపాటు, భూసారం దెబ్బతింటుందని, ఈ దిశగా వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలన్నారు.
సమావేశంలో పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ, చాలా సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న పోడు సమస్య పరిష్కారం అయినట్లు తెలిపారు. ఆర్వోఎఫార్ ప్రక్రియ పూర్తి అయ్యాక, మధ్యవర్తులు అమాయకులను మోసం చేస్తున్నారని, కొత్తగూడెం, ఇతర ప్రాంతాల గుత్తికోయలకు ప్రలోభపెట్టి డబ్బులు వసూలుచేసి, పోడుకు చూస్తున్నారని అన్నారు. అటవీ అధికారులపై దాడులు చేస్తున్నారని, అక్రమ కార్యకలాపాలు సాగిస్తున్నారని, ఇటువంటి వారిపై ఉక్కుపాదం మోపాలని అధికారులకు నిర్దేశించినట్లు, ఇప్పటికే 12 కేసులు పలుచోట్ల నమోదు చేసినట్లు తెలిపారు.
సంబంధం లేనివారికి ఆశలు కల్పించి మోసం చేస్తున్నారని, ప్రజలు మోసపోకుండా, అధికారుల సూచనలు పాటించాలని ఆయన తెలిపారు. అటవీ అధికారులు క్షేత్రస్థాయిలో వున్నప్పుడు వారిపై దాడులు చేయడం, వారి విధులకు అంతరాయం కలిగించడం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల అమలులో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు.