నీ కళ్ళమెరుపులకు కొత్తఊయలలు కట్టి
బోధన, అభ్యసనాల దారాల్ని చుట్టి
కాలమనే పనిముట్టుకు పెన్నుగానో ,
పుస్తకంగానో తట్టి, నిన్నో గాటనపెడ్తాడు.
నీ గడుసు ప్రకృతి గమనంలోకి వచ్చి
పరీక్షలే పరమావధి అయినప్పుడు
మస్తష్కపుశిలనుతొలిచి, మెప్పుల శిల్పాన్నిచెక్కుతు,ఉత్తీర్ణత మార్గాన
నిన్ను గట్టిక్కించే ఊతకర్రౌతాడు.
కోరికల అగర్తువు నువ్వైతే, కోటగోడల వెనుక మండే సమస్యల్ని గుండెవెనుక
దాచగలిగే ఉపాయమౌతాడు.
అయినవాళ్ళకు బాధ్యతారాహిత్య బలాదూర్ నువ్వైనప్పుడు , తరతమ భేదమెరుకజేసే గమ్యమౌతాడు.
బడి ప్రాంగణ ప్రాణమై,కళాశాల అధ్యాపక కళై , విశ్వ విద్యాలయ ఆరాధ్యఆచార్యుడై , జ్ఞాన
విజ్ఞాన చక్షువుల్ని మేల్కొలిపే ఈ మేటి వాగ్గేయకారులు నీ రెక్కలకు కదలికనేర్పి
భావాంబరంలో భవ్య విహంగాన్ని చేసి,
బ్రతుకు విశాలత్వంలోఎగరడంచెప్తారు.
కాలమొక్కతీరుగడుపుగుండెధైర్యమెగురువు, దూరదృష్టి నీకు లేదను దూషణల దండనైనాగాని, వెన్నెల పంచే చంద్రునివే నీవైతే, వెలుగునందిచే స్వయంప్రకాశ సూర్యుడే గురువు!
పాఠ్యాంతరాలకు ఉన్ముఖుడినిచేసే పనిలో ప్రపంచాన్ని తనమాటల్లో ఒంపేసే గురువు , నువ్వు అక్షరమై జీవించాలంటే తానే ఓ గ్రంథమయ్యేవాడు.
ఐదేళ్ళ ప్రథమాంకురంనుండి, ఇరవై ఐదేళ్ళ వృక్ష మయ్యేవరకు పరువు మర్యాదల నేలతల్లి అయ్యే గురువు
చేతులు కలుపలేని ఈ కాలంలోనూ
చేతులు జోడించగలిగే చైతన్యదీప్తులు గురువు.
గురువులు నిత్యోత్సవాలు జరిప ప్రస్తుతించే విబుధవరులు !
– కొండపల్లి నీహారిణి